సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విద్యార్థులకు ఆల్ది బెస్ట్ చెప్పారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యా ర్థులకు ధైర్యం చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 44 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 20,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇంటర్ భవిష్యత్కు పునాది లాంటిదని, పరీక్షలు బాగా రాసి తల్లిదండ్రులకు, కళాశాల, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి మార్చి 19 వరకు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ బి.అనురాధ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని.. విద్యార్థులు పరీక్షా సమయం కంటే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.
చేర్యాల, ఫిబ్రవరి 27: నేటి నుంచి ప్రా రంభం కానున్న ఇంటర్ పరీక్షలను విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనుసులోకి రానివ్వకుండా, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంగళవారం ప్రకటనలో కోరారు. ఇంట ర్ విద్యార్థులకు ఆల్ దిబెస్ట్ చెప్పారు. భవిష్యత్కు కీలకమైన మలుపు ఇంటర్మీడియట్ అన్నారు.