హుస్నాబాద్, డిసెంబర్ 21: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే విషయంపై ఫిర్యాదులు రాగా, ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం జిల్లా మోడల్ పాఠశాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. వంట సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం ఎం దుకు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం అందించాలని ప్రిన్సిపాల్ అన్నపూర్ణకు సూచించారు. పాఠశాలలో ఏదైనా ఘటనలు జరిగితే వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తరచూ పాఠశాలను పర్యవేక్షణ చేయాలని డీఈవోకు సూచించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు, ఆర్టీఏ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాన్ని అన్వేషణ చేయాలని తహసీల్దార్ రవీందర్రెడ్డికి సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నివసించేలా ఏర్పాట్లు చేయాలని, మంత్రి నివా సం చుట్టూ ఉన్న ప్రభుత్వ స్థలాల విచారణ చేపట్టి ప్రహరీ నిర్మించాలని సూచించారు.