సంగారెడ్డి, ఫిబ్రవరి 4: ప్రభుత్వం సౌర విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అందజేసే స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో శనివారం సౌర విద్యుత్ యూనిట్లకు స్త్రీనిధి రుణాలు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యావరణ పరిరక్షణపై ఎంపీడీవో ఆకుల రవీందర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో స్త్రీలు ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఇంట్లోని తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందజేసేది వారేనని గుర్తు చేశారు.
పరిసరాల పరిశుభ్రతకు మహిళా సంఘాల సభ్యులు ఉద్యమంలా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు. ఆడపిల్ల పెండ్లిళ్లకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకట్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.