ములుగు, జూలై 15 : ప్రాజెక్టుల కోసం భూములిచ్చి… తరతరాలుగా ఉంటున్న ఇండ్లను వదిలి… భూనిర్వాసితులుగా మారిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం, పునరోపాధిని కల్పిస్తూ నిర్వాసితుల జీవితాలకు భరోసాను కల్పింది. కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయిన మామిడ్యాల, భైలంపూర్, తానేదార్పల్లి, తానేదార్పల్లి తండా నిర్వాసితుల త్యాగాలను గుర్తించిన ప్రభుత్వం వారిని అన్నివిధాలుగా ఆదుకున్నది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలను అందించి అందమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్వాసితుల కోసం సిద్ధం చేసి అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి భూనిర్వాసితులను హక్కున చేర్చుకున్నారు. న్యాయమైన నష్టపరిహారాన్ని అందించడంతోపాటు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలపరిధిలోని తునికిబొల్లారం సమీపంలో విశాలమైన రోడ్లు, పూర్తిస్థాయి మౌలిక వసతులతో కూడిన చక్కని గృహసముదాయాలను నిర్మించి అందించింది.
అందమైన గృహ సముదాయాలు
కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలోభాగంగా ముంపునకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతనిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజవకర్గంలోని ములుగు మండలపరిధిలోని మామిడ్యాల, భైలంపూర్, తానేదార్పల్లి, తానేదర్పల్లి తండా గ్రామాల్లో సుమారుగా 877 కుటుంబాల ప్రజలు నివసించేవారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన ఆర్అండ్ఆర్ గృహాలు ప్రతి కుటంబానికీ ఒక ఇంటితోపాటు ఆ కుటుంబంలో పెండ్లయిన దంపతులు ఉంటే వారికి అదనంగా మరో ఇంటిని నిర్మించి అందించింది. దీంతో ఒకే కుటంబానికి రెండేసి, మూడేసి ఇండ్లు అందాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సుమారుగా 877 ఇండ్లు ఉండగా ప్రస్తుతం ములుగు మండలపరిధిలోని తునికిబొల్లారంలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో 1200 ఇండ్లను ప్రభుత్వం నిర్మించి నిర్వాసితులకు అందించింది. ఆర్అండ్ఆర్ గృహాల నిర్మాణాలకు దాదాపుగా 260 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించగా అందులో 250 గజాల విస్తీర్ణంలో ఒక్కో ఇంటిని ప్రభుత్వం నిర్మించింది.
కాలనీలో సకల వసతుల కల్పన
గృహ సముదాయాల ఆవరణలో విశాలమైన రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి ఇంటికీ విద్యుత్, మౌలిక వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీ జిగేల్మంటోంది. అన్ని వసతులతో గృహాలు నిర్మించి నిర్వాసితులకు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగానే నిర్వాసితుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పూర్తిస్థాయి మౌలిక వసతులను సమకూర్చింది. ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వాసితులకు అం దించిన ఇండ్లలో రెండు పడక గదులతోపాటు హాల్, కిచెన్, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. మంచి నీటి సౌకర్యం కోసం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటి వసతిని కల్పించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇతర అవసరాల కోసం 100 గజాల ఖాళీ స్థలాన్ని కేటాయించారు. కాలనీవాసుల సౌకర్యార్థం పాఠశాల భవనం, గుడు లు, ఫంక్షన్హాళ్లతోపాటు కమ్యూనిటీ భవనాలను కూడా ప్రభుత్వం నిర్మించింది.
నిర్వాసితులను అక్కున చేర్చుకున్న ప్రభుత్వం
గతంలో భూనిర్వాసితులంటే చాలీచాలని.. అందీఅందని.. నష్టపరిహారం..! చెట్టుకొకరు.. పుట్టకొకరుగా.. విడిపోయిన బతుకులు..! ఇప్పటికీ నష్టపరిహారం అందక కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది కుటుంబాలు. కానీ స్వరాష్టంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అలాంటి పరస్థితి లేదు. వారి జీవితాలకు నిండు భరోసాను ఇస్తూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ న్యాయమైన నష్టపరిహారాన్ని అందించి భూనిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపి వారిని ముందుకు నడిపిస్తూ హక్కున చేర్చుకున్నది ప్రభుత్వం. గ్రామాలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కనుమరుగయ్యాయని, బతుకులు ప్రశ్నార్థకంగా మిగిలిపోతాయేమోనని నిర్వాసిత గ్రామస్తులు మొదట్లో కొంత ఆందోళన చెందినప్పటికీ పూర్తిస్థాయి మౌలిక వసతులతో ప్రభుత్వం నిర్మించి అందించిన ఆర్అండ్ఆర్ గృహ సముదాయాలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం అండగా నిలిచింది..
ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అం డగా నిలిచింది. ఆర్అండ్ఆర్ కాలనీలో పూర్తిస్థ్ధాయి మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించింది. విశాలమైన రోడ్లు, విద్యుత్ దీపాలతో కాల నీ పట్టణాలను తలస్తుంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజితోపాటు చక్కని గృహ సముదాయాన్ని నిర్మించి అన్ని రకాలుగా నిర్వాసితులకు ప్రభుత్వం అం డగా నిలబడుతోంది.
-బట్టు అంజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్
ఆదర్శంగా పునరావాస కాలనీ
కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన గ్రామాల వాసుల కోసం ప్రభుత్వం నిర్మించి అందించిన పునరావాస కాలనీ దేశానికే ఆదర్శంగా నిలించింది. గతంలో పునరావాస కాలనీలంటేనే మౌలిక వసతులు లేక అభివృద్ధికి దూరమై అంధకారంగా ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కొండపోచమ్మ పునరావాస కాలనీ ఓ పట్టణంలా రూపొందింది.
-జహంగీర్, ఏఎంసీ చైర్మన్
కొత్త కాలనీయే బాగుంది..
గతంలో మేము ఉన్న ఊరు, ఇండ్ల కంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు కొత్త కాలనీ చాలా బాగుంది. ఇప్పుడు మాకు అప్పటి కంటే మంచిగా ఇండ్లు కట్టించారు. ఊర్లు పోతయని తెలిసినప్పుడు కొంత భయం ఏర్పడినప్పటికీ ప్ర భుత్వం మాకు అండగా నిలువడంతో సంతోషంగా ఉన్నాం.
-నాగోజి అనిల్కుమార్, మామిడ్యాల భూనిర్వాసితుడు
పట్నంలో ఉన్నట్లు అనిపిస్తుంది..
మాకున్న జాగా, ఇల్లు ప్రాజెక్టుల పోయింది. కేసీఆర్ సార్ చెప్పినట్టే పైసలు ఇచ్చిండు. మంచిగా ఇండ్లు కట్టిచ్చిండు సారు సల్లగుండాలే. నాలుగు ఊర్లొల్లం ఒక్కదగ్గరకొచ్చిన్నందుకు సంతోషంగా ఉంది. మా పాత ఊరు కంటే సర్కారు ఇచ్చిన కొత్త ఊరే మంచిగున్నది. ఇప్పుడు పల్లె నుంచి పట్నం వచ్చినట్టు అనిపిస్తుంది.
-తిమ్మ నాగలక్ష్మి, భైలంపూర్ భూనిర్వాసితురాలు