రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో మంత్రి పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా అందోల్, చౌటకూర్ మండలాల జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేనంలో పాల్గొన్నారు. అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ, బస్తీ దవాఖాన, ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రం, 576 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రూ. 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల పైలన్, రూ. 60 లక్షలతో బహుదూర్ఖాన్ ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ. 2కోట్లతో నిర్మించనున్న దోబీఘాట్ పనులకు శంకుస్థాన చేశారు. బస్టాండ్ను తనిఖీ చేసి పారిశుధ్యం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించారన్నారు. నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాలెల్మ బీజేపీ వార్డు మెంబర్ రవితో పాటు మరో 100 మంది, గూడెం నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అందోల్, ఏప్రిల్ 12: “బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాల్లో సమ ప్రాధాన్యాతనిస్తూ బీఆర్ఎస్ ఎదురలేని శక్తిగా ఎదుగుతున్నది.” అని అర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం అందోల్ మండల పరిధిలోని సంగుపేట లక్ష్మీనర్సింహ గార్డెన్ల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి, ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి, ప్రజాప్రతినిధులకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, వారే పార్టీకి వెన్నుముక అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇక్కడి పథకాలనే పక్క రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలోని అభివృద్ధిని చూసి దేశ వ్యాప్తంగా పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో తాలెల్మ గ్రామానికి చెందిన బీజేపీ వార్డు మెంబర్ రవితో పాటు 100 మంది, గూడెంకు చెందిన వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అందోల్ నియోజకవర్గంలో కరెంట్, నీళ్లకు లోటు లేదని రైతులు చెప్పడం ఆనందంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ప్రాంతంలో డిప్యూటీ సీఎంగా దామోదార రాజనర్సింహ ఉన్నప్పటికీ అందోల్ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఎద్దేవా చేశారు. అందోల్ నియోజకవర్గంలో ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే అందోల్ మండలంలోని తాలెల్మ రైతుల విజ్ఞప్తి మేరకు రేణుకాఎల్లమ్మ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ రిగేషన్ నిర్మించి 10వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
మండలంలోని పోసాన్పేట్కి చెందిన సత్యనారాయణ అన్న మాటలు వింటే కడుపు నిండిందని మంత్రి అన్నారు. జోగిపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి వెళ్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న రైతును మంత్రి హరీశ్రావు పలుకరించగా, సార్.. మల్లోసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తది. కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవుతాడని రైతు తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఎందుకు పెద్దాయన అని మంత్రి రైతును ప్రశ్నించగా, ఒక్క బోరుతోనే ఎనిమిది ఎకరాల పొలం పరుతుందని, గతంలో ఒక్క ఎకరా పారిన దఖలాలు లేవని కానీ, ఇప్పుడు ఇరం లేకుండా కరెంట్ ఉండటం భూగర్భజలాలు పెరగడంతో సమృద్ధిగా నీళ్లు వస్తున్నాయి. రెండు పంటలకూ సరిపోను నీళ్లు అందుతున్నాయ రైతు తెలిపాడన్నారు. చెరువులు అభివృద్ధి చెయ్యడం, కాల్వలు తవ్వించడం, ప్రాజెక్టులు నిర్మించడంతో వలస వెళ్లిన వారు గ్రామాలకే వచ్చి పంటలు పండిస్తున్నారని, ఇది కాదా ఆత్మగౌరవ తెలంగాణ అని మంత్రి అన్నారు. 40 ఏండ్ల నుంచి నిండని సంగుపేట్ చెరువు తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే నిండి, అలుగు పారుతూ కళకళలాడుతుందన్నారు. చెరువు పూర్తిగా నిండడంతో చేపలు పట్టేందుకు ముదిరాజులు ఇబ్బందులు పడుతున్నారని, నీటి మట్టం తగ్గించాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను తన దృష్టికి తెచ్చినట్లు గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని, గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సింగూరు నీళ్లు అంటే హైదరాబాద్కు పరిమితం అనే మాట ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగూరు నీళ్లను ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకే పరిమితం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాల తీరుతో ఇబ్బందులు పడ్డ ఇక్కడి రైతులు ఇప్పుడు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. సింగూరు కాల్వలు సక్రమంగా లేక రైతులు గోసపడ్డారని, రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాల్వలను పునరుద్ధరించి పంటల సాగుకు సాగునీరు అందిస్తుందన్నారు. దీంతో రైతులు పుట్లకు పుట్లు ధాన్యం పండిస్తున్నారని, గతంలో కొంతమంది రైతులు మొదటి పంట మీరే కొయ్యాలని కోరగా, స్వర్గీయులు మాజీ ఎంపీ మాణిక్రెడ్డితో కలిసి పండుగ వాతావరణంలో కోతలు ప్రారంభించిన విషయం గుర్తు చేశారు.
అందోల్ నియోజకవర్గంలో 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధి, రాష్ట్రం ఏర్పడిన 8 ఏండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసి పుష్కలంగా నీళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఎడారిలా మారిన అందోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సస్యశామలమైందని, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, ఇలాంటి ప్రజాప్రతినిధి ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం అని మంత్రి అన్నారు.
జోగిపేట పట్టణంలోని వడ్డెర బస్తీలో నూతనంగా నిర్మించిన 108, గూడెంలో నిర్మించిన 216, జోగిపేటలో 252 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేదలకు వరంగా మారాయని అన్నారు. గతంలో పని చేసిన ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణానికి రూ.40 వేలు ఇచ్చేవి, అందులో అధికారులకు, పైరవీకారులకే రూ.10 వేలు పోయేవని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెడుతూ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్నదని చెప్పారు. అంతకుముందు ఇండ్ల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రికి డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
అందోల్ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను మంత్రి హరీశ్రావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజహితం కోసం కృషి చేసే వృత్తి జర్నలిజమని, ప్రజలకు వాస్తవాలను చెప్పే బాధ్యత వారిదేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడిటేషన్లు ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 21,295 మందికి అడ్రిటేషన్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. రూ.15 కోట్లతో మీడియా భవన్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. కరోనా కాలంలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నదని గుర్తుచేశారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్రావు చొరవతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమైందన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
– అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
అందోల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే ఇంతటి వాడినయ్యానని, మీ ఆశీస్సులు నాపై ఎప్పటికీ ఇలానే ఉండాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై నమ్మకంతో అందోల్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నన్ను ఎమ్మెల్యే గెలిపించేందుకు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాని, ఇదంతా ప్రజల ఆశీర్వాదంతోనే జరుగుతుందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి అభివృద్ధి కోసం మంజూరైన నిధులను కాజేసిన దామోదార రాజనర్సింహ ఆస్తులను పెంచుకున్నాడే తప్ప, అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అందోల్లో కాంగ్రెస్, బీజేపీలకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి పెద్దఎత్తున
తరలివచ్చిన పార్టీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
– సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ
గులాబీ జెండాతోనే నీళ్లు సాధించుకున్నామని, సింగూరు నీళ్లను కాపాడుకుని జిల్లాకు వినియోగించుకునేలా చేసుకున్నామంటే ఇదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల తీరుతో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతోనే ఉమ్మడి మెదక్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
– డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం, బలగమని డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్రెడ్డి అన్నారు. ప్రజల బలం ఉంటేనే అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయగలమన్నారు. అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలగం కావాల్సినంతగా ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందోల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
– జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
దేశ ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కాఫీ కొట్టడం సిగ్గు చేటన్నారు. దేశ స్థాయిలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ దేశంలోనూ విజయం సాధించడం ఖాయమన్నారు.