మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 5: ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు.. గల్లీకొచ్చి విమర్శలు చేస్తున్నారన్నారంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయని, మన పథకాలను కేంద్ర ప్రభుత్వం, పక్క రాష్ర్టాలు నకలు కొడుతున్నయని చెప్పారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను జిల్లాలో ఎంపికైన 27 గ్రామ పంచాయతీలకు బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో అందజేశారు. పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అవార్డులను జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, కలెక్టర్ రాజర్షి షా, డీపీవో సాయిబాబా, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డితో కలిసి అందజేశారు. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఉప సర్పంచ్లను మంత్రి శాలువాలతో సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోటీతత్వం పెరగడానికి అవార్డులు ఎంతో దోహదం చేస్తాయన్నారు.
దేశంలో ఎంపీలు దత్తత తీసుకునే గ్రామ పంచాయతీలకు ఇచ్చే అవార్డులో ఒకటి నుంచి పది అవార్డులు మొత్తం తెలంగాణకే వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో పాలన బాగుందనడానికి ఇది చాలదా? అన్నారు. ఈనెల నుంచే గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధులు పంచాయతీ ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. వైద్యరంగ సేవలందించడంలో దేశంలోనే తెలంగాణ 3వ స్థానంలో నిలువగా, డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్ 28వ స్థానంలో ఉందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం మెదక్కు మెడికల్ కళాశాల రాబోతున్నదన్నారు. కార్యక్రమాన్నుద్దేశించి కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, డీపీవో, ఎమ్మెల్యేలు మాట్లాడారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రమేశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో శైలేశ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.