మెదక్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. గొర్రెల పంపిణీ పథకంపై పలు సూచనలు చేశారు. ఇప్పటికే యాభై శాతం మందికి గొర్రెల పంపిణీ పూర్తయిందని, మిగతా లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. 2017లో ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 52 నిబంధనలను అనుసరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రభుత్వం ఏవైనా కొత్త నిబంధనలను అమలు చేయదలిస్తే వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అందజేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మేలు రకానికి చెందిన గొర్రెలు కొనుగోలు చేయడానికి సమర్థులైన జిల్లా అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గొర్రెల రవాణా, వాటికి బీమా, దాణా, జియో ట్యాగింగ్ తదితర అంశాలను పశుసంవర్ధక శాఖ అధికారులు పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ పథకాన్ని ఇదివరకు అమలు చేసిన అనుభవం ఉన్నందున ప్రస్తుతం మరింత మెరుగైన రీతిలో గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం శాంతికుమారి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ పథకంతోపాటు కంటివెలుగు, ఆరోగ్య మహిళా, జీవో నెంబర్లు 58, 59, 76, 118 అమలు తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటివెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్థంగా అమలు జరిగేలా చూడాలన్నారు. కంటివెలుగు శిబిరాలు మెదక్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయంటూ సీఎస్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి గత విడతలో మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 6,152 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్ల పంపిణీ లక్ష్యంగా రూ.లక్షా 75 వేల విలువ గల ఒకో యూనిట్లో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ పోగా, లబ్ధిదారు వాటాగా రూ.43,750 చొప్పున 852 మంది లబ్ధిదారుల డీడీలు అందజేశారని, మిగతా లబ్ధిదారుల నుంచి డీడీల సేకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీవో నెంబరు 58 కింద అర్హులందరికీ క్రమబద్ధీకరణ పట్టాలు అందించామని చెప్పారు. 59 కింద పూర్తిగా డబ్బులు చెల్లించిన 90 మందికి రిజిస్టర్డ్ పట్టాలు అందించామన్నారు.
58, 59 జీవోల కింద ఎకువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడగించిన గడవుపై ప్రజలకు సమాచారం చేరవేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వేసవి దృష్ట్యా కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారి కోసం షామియానా, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇటీవల జిల్లాలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని పరిశీలించిన ఆరోగ్య, కుటుంబ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి మొబిలైజషన్ తీరు, రెఫర్ చేస్తూ ఫాలో అప్ చేస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు అందజేసిన లబ్ధిదారుల వివరాలను ఫారం4-బి అప్లోడ్ చేశామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందూనాయక్, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి విజయశేఖర్రెడ్డి, ఆర్డీవోలు సాయిరామ్, శ్యామ్ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.