చేర్యాల, డిసెంబర్ 12: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేశాయి. కల్యాణోత్సవం అనంతరం స్వామివారి ఉత్సవాలను తొమ్మిది ఆదివారాల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రభుత్వశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయవర్గాలు కొమురవెల్లి క్షేత్రంలో పారిశుధ్య నిర్వహణతో పాటు రాజగోపురం, రాతిగీరల మండపం, కోడెల స్తంభం, గదులకు మరమ్మతులు, రంగులు, సున్నం తదితర పనులు చేస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి 50వేల మంది భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజు పెద్ద పట్నం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో కీలకమైనవి. భక్తులు భారీగా స్వామివారి క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆలయవర్గాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు.
భక్తుల వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి భక్తులు దర్శనం చేసుకునేందుకు రాజగోపురం నుంచి హనుమాన్ ఆలయం వరకు క్యూన్లు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా 60 నల్లాలు ఏర్పాటు చేశారు. కోనేరులో స్నానాల కోసం శుద్ధి చేసే యంత్రాలను సిద్ధం చేశారు. కాటేజీల మరమ్మతులు చేస్తున్నారు. తోటబావి, కల్యాణ వేదిక తదితర ప్రదేశాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర పనులతో పాటు ఎర్రమట్టితో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలతో పాటు కొమురవెల్లి మీదుగా యాదగిరిగుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రాలకు బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఇటీవల జరిగిన సమావేశంలో కోరారు. పూర్వపు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో 25 వేల కల్యాణ పత్రికలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే ప్రాంతాలకు 20 వేల కల్యాణోత్సవ వాల్పోస్టర్లు పంపించారు. క్షేత్రంలో భక్తుల రక్షణ కోసం ప్రస్తుతం పని చేస్తున్న 30 కెమెరాలతో పాటు మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్లే మార్గం నుంచి భక్తులు లోపలికి వచ్చి దర్శనం చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రెండు రోజుల పాటు పెండ్లి వేడుకలు
స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలను ఆలయవర్గాలు రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 18న (ఆదివారం) ఉదయం 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం (బలిహరణం), 10-45 గంటలకు స్వామి వారి కల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి ఏడు గంటలకు రథోత్సవం (బండ్లు తిరుగుట), 19న సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష భిల్వార్చన, అనంతరం మహామంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది 9 ఆదివారాలు
ఈ ఏడాది 9 ఆదివారాల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. జనవరి 22వ తేదీన పట్నంవారం (మొదటి ఆదివారం), 23న హైదరాబాద్ భక్తుల ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండం, 29న లష్కర్ వారం (రెండో ఆదివారం), ఫిబ్రవరి 5న మూడో ఆదివారం, 12న నాలుగో ఆదివారం, 18న మహాశివరాత్రి పెద్దపట్నం, 19న ఐదో ఆదివారం, 26న ఆరో ఆదివారం, మార్చి 12న ఏడో ఆదివారం, 19న తొమ్మిదో ఆదివారం(అగ్నిగుండాలు) నిర్వహించనున్నారు.
పెండ్లిపిలుపు
భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 18వ తేదీన (ఆదివారం) అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయవర్గాలు స్వామివారి కల్యాణ ఆహ్వాన పత్రికలను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, దాతలు, అధికారులు, భక్తులకు పంపిణీ చేస్తున్నారు. స్వామివారి క్షేత్రంలో నిర్వహించే ఈ మహోత్సవాన్ని చూసి తరించాలని ఆలయవర్గాలు కోరుతున్నాయి.
వరుడు : శ్రీ మల్లికార్జున స్వామి
వధువులు : శ్రీ మేడలాదేవి-శ్రీ కేతమ్మదేవి