పాపన్నపేట : కేసుల దర్యాప్తులో ( Case investigation ) వేగం పెంచి బాధితులకు సత్వర న్యాయం అందించేలా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ( D.V. Srinivasa Rao ) సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ నిర్వహణను పరిశీలించారు.
స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది బ్యారక్స్, స్వాధీనం చేసుకున్న వాహనాల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి కేసులో శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రత్యేక కార్యాచరణతో త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.