న్యాల్కల్, మే 1: మండల పరిధిలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని సిద్ధ సరస్వతీ పంచవటీ క్షేత్ర సమీపంలో జరుగుతున్న గరుడ గంగా పూర్ణ మంజీరా కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సోమవారం పంచవటీ క్షేత్రంలోని సిద్ధ సరస్వతీ దేవి, షిర్డీసాయిబాబా, వేంకటేశ్వర స్వామి, సూర్యభగవన్, గంగామాత ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభమేళాకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మంజీరా నదిలో ఫుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆయా ఆలయాల్లోని దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగసాధువులు, డిగంబర సాధువులు, స్వామీజీలు భాజాభజంత్రీలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా మంజీరా నదికి తరలివెళ్లి పుణ్య స్నానాలను చేసి, సమీపంలోని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కుంభమేళాకు హుల్పూర్ పీఠాధిపతి డా.శివానందస్వామి, తమ్మూలూర్ సంస్థానం పీఠాధిపతి 1008 శివానంద శివాచార్యులు హాజరై భక్తులకు ప్రవచానాలను బోధించారు.
పలువురు భక్తులు పంచవటీ క్షేత్రంలో సరస్వతీదేవికి ఒడి బియ్యం పోసి, తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. క్షేత్రం ఆవరణలో దాతలు భక్తులకు అన్నదానం చేశారు. కుంభమేళా మరో నాలుగురోజుల్లో ముగియనుండడంతో భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. పంచవటీ క్షేత్రంతో పాటు మంజీరా నదీ తీరంలో పరిసరాలు శుభ్రంగా ఉంచేలా డీఎల్పీవోలు రాఘవరావు, సంజీవ్రావు, ఎంపీడీవో వెంకట్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్ బందోబస్తుతో పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.