రామాయంపేట, జనవరి 7: జిల్లా వ్యాప్తంగా పదో తరగతికి ప్రత్యేక క్లాసులు బోధిస్తున్నట్లు మెదక్ జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ అన్నారు. శనివారం రామాయంపేటలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల, డి.ధర్మారం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనఊరు మనబడి పనులను పర్యవేక్షించి, పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 313 ప్రభుత్వ పాఠశాలలకు మనఊరు మనబడి నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం 256 పాఠశాలల్లో టెండర్లు పూర్తై, పనులు కూడా చేస్తున్నట్లు తెలిపారు. 40 పాఠశాలలకు టెండర్లు పూర్తి కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 42 ప్రభుత్వ పాఠశాలల పనులు పూర్తైనటుల తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు రోజూ ప్రత్యేక బోధన చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్నాక్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు చేరుకోవాలని, లేకుంటే మెమోలు ఇస్తామన్నారు. విద్యాధికారి వెంట బాలికల పాఠశాల హెచ్ఎం.రాగి రాములు, ఉపాధ్యాయులు ఉన్నారు.