గుమ్మడిదల, ఏప్రిల్ 18: భద్రతపై ప్రత్యేకమైన అవగాహనతోనే పరిశ్రమల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ రూపేశ్ తెలిపారు. గురువారం మండలంలోని బొంతపల్లి హెటిరో పరిశ్రమ యూనిట్ -1లో పారిశ్రామిక ప్రతినిధులతో ఎస్పీ ఎస్ఎస్ఎస్సీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ సంజీవరావు, ఎస్ఎస్ఎస్సీ జీఎస్ సత్యనారాయణ, హెటిరో జీఎం వెంకటేశ్వర్రెడ్డి, జిన్నారం, బొల్లారం సీఐలు సుదీర్కుమార్, గంగాధర్, ట్రాఫిక్ సీఐ శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇటీవల తరచూ జరుగుతున్న కెమికల్, అగ్ని ప్రమాదాలను నివారించడానికి పారిశ్రామికవేత్తలు పరిశ్రమల్లోని ఉద్యోగులకు, కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమలు ఉమెన్ సేఫ్టీ, కార్మికుల భద్రత తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. ఇటీవల పాశమైలారం, హత్నూర, బొల్లారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాదాలతోపాటు కెమికల్ ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమల్లో జరిగే ఉత్పత్తిపై అవగాహన ఉంటే ప్రమాద తీవ్రతను గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉంటాయన్నారు.
ప్రతి పరిశ్రమలో రిస్క్ ఆపరేషన్ టీం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని ఎస్పీ అన్నారు. పారిశ్రామిక వాడలో మూసివేసిన పరిశ్రమల్లో మాదక ద్రవ్యాలైన డైజోఫామ్, క్లోరోఫామ్ లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, ఇదీ సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి పరిశ్రమలో వ్యర్థాలు బయటకు పంపించకుండా పరిశ్రమలోనే కెమికల్ డంపింగ్లు ఏర్పాటు చేసి ప్రకృతికి హాని జరగకుండా చూడాలన్నారు. హత్నూర పారిశ్రామిక వాడలోని బీఆర్ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన ప్రమాద వీడియోను పారిశ్రామికవేత్తలకు చూపించారు. ప్రతి పారిశ్రామిక వాడలో సీఎస్ఆర్ నిధులతో రోడ్లు, ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎస్ఎస్ఎస్సీ వలన ఇండస్ట్రీ, పోలీస్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రతి ఐలాలో కెమికల్ ప్రమాదాలు, ఫైర్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇండస్త్రీస్ అసోసియేషన్ ప్రతినిధి ఆనంద్రావు మాట్లాడుతూ బొల్లారం, జిన్నారం, బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అగ్ని ప్రమాదాలను త్వరగా అదుపులోకి తేలేకపోతున్నామన్నారు. పారిశ్రామికవాడల్లో తప్పనిసరిగా ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్లు సరిగా లేక వ్యర్థ జలాలతో బొల్లారంలోని ఆసానికుంట పూర్తిగా కలుషితం అయ్యిందన్నారు. అనంతరం న్యూలాండ్ పరిశ్రమ ప్రతినిధి రవికుమార్ మాట్లాడుతూ కలుషితమైన నీళ్లు వస్తున్నాయని స్థానికులు హెచ్చరిస్తున్నారన్నారు. కలుషిత జలాల నివారణకు పారిశ్రామికవేత్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెటిరో పరిశ్రమ ప్రతినిధి వెంకటేశ్వర్రెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ రామ్మోహన్రెడ్డి, పారిశ్రామికవాడలోని వివిధ పరిశ్రమల హెచ్ఆర్ మేనేజర్లు పాల్గొన్నారు.