మెదక్ అర్బన్, జనవరి 25: తెలంగాణ పోలీస్ పేరును దేశంలో చాటిచెప్పే విధంగా పోలీసులు పనిచేయాలని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషనల్లో నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న కేసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రతి యూనిట్కి ఒక ప్రత్యేకత ఉంటుందని, జిల్లాల వారీగా పోటీతత్వం, పట్టుదలతో అన్ని విభాగాల్లో సమిష్టి కృషితో ముందుకెళ్లి మంచి పనితనం కనబర్చాలన్నారు. రాష్ట్ర పోలీస్ భవిష్యత్ యువ ఐపీఎస్ ఆఫీసర్ల చేతుల్లో ఉందని వారు ఉత్తమ ప్రదర్శన కనబరచాలని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించాలన్నారు.
మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, సమర్ధవంతంగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వాలన్నారు. అలాగే, మహిళలపై జరుగుతున్న నేరాలు అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు, పోక్సో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల్లో కన్విక్షన్ రేట్ పెరిగిందని తెలిపారు. పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్లు ముఖ్యమని వాటిని త్వరగా తెప్పించుకొని, ప్రతిరోజు కేసులను టార్గెట్ పెట్టుకొని కేసులు ఛేదించాలని సూచించారు.
పోక్సో కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా చూసి బాధితులకు తగు నష్టపరిహారం అందేవిధంగా చూడాలని, చట్టంపై సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. కేసుల్లో సాక్ష్యులకు మనోధైర్యాన్నిస్తూ మోటివేట్ చేయాలన్నారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజిమెంట్ సిస్టం అప్లికేషన్ యొక్క పనితీరును వివరిస్తూ, దానివల్ల సిబ్బందికి కలిగే ఉపయోగాలను వివరించామన్నారు. ఉద్యోగి డేటా, అవార్డులు, రివార్డులు ట్రాన్స్ఫర్ వివరాలు, ప్రయోజనాలు, ట్రైనింగ్, ఉద్యోగులు హాజరులాంటి ఉద్యోగి యొక్క పూర్తి సమాచారం వరకు హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో పొందుపర్చాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి, జిల్లా ఎస్పీని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, మెదక్ డీఎస్పీ సైదులు తదితరులు పాల్గొన్నారు.