ఉమ్మడి మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. నిత్యం ఏదో ఒక చోట టన్నుల కొద్దీ టాస్క్ఫోర్స్ అధికారులకు పట్టుబడుతున్నది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చినా ఫలితం లేకుండాపోతోంది. వారం పది రోజులుగా ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీ చేస్తుండగా, అక్రమార్కులు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కోహీర్ ప్రాంతాల మీదుగా పక్క రాష్ర్టాలకు తరలిస్తున్నట్లు తెలిసింది.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా, కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ఈ దందాకు రైస్ మిల్లర్లు తోడవడంతో రేషన్ బియ్యం రాష్ట్రం దాటుతోంది. ఇంత జరుగుతున్నా ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు తప్ప, స్థానిక శాఖకు సంబంధించిన అధికారులు పట్టుకోకపోవడంతో పాటుచూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సిద్దిపేట, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని కరోనా వచ్చినప్పటి నుంచి ఉచితంగానే ప్రతి నెలా పేదలకు బియ్యం అందిస్తుంది. కానీ కొంత మంది వ్యాపారులు, రేషన్ డీలర్లు కుమ్మక్కై పేదల బియ్యాన్ని అప్పనంగా అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా పెట్టాల్సిన అధికారులు గుమ్మనంగా ఉండిపోతున్నారు. ప్రత్యేక తనిఖీ బృందాలు వచ్చి తనిఖీలు చేస్తే తప్ప బియ్యం దందా ఆగడం లేదు. వారం పది రోజుల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వందల టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని పట్టుకున్నాయి.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థను కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ లక్ష్యాన్ని నిరుగారుస్తున్నారు. నిరుపేదల బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురపిస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే చిరు వ్యాపారులు మోటర్ సైకిల్, ఆటోలపై ఇల్లిల్లూ తిరిగి బియ్యం సేకరించి మిల్లుల వ్యాపారులకు అమ్ముతున్నారు. మరికొంత మంది రేషన్ డీలర్లు రైస్ మిల్లుల వ్యాపారులతో కుమ్మక్కై రాత్రికి రాత్రి ఆటోల్లో బియ్యాన్ని రేషన్ దుకాణాల నుంచి మిల్లులకు తరలిస్తున్నారు.
అక్కడ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మిల్లు యజమానులు లారీల్లో లోడ్ చేసి జిల్లా సరిహద్దులు దాటించి ఇతర రాష్ర్టాలకు పంపుతున్నారు. ఇక్కడ వ్యాపారులు గ్రామాల్లో తక్కువ ధరకు సేకరించి ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతుంది. రేషన్ దుకాణాలను తనిఖీ చేసి విక్రయాలకు, నిల్వలకు వ్యత్యాసాలను ఎప్పటికప్పుడు గమనించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి నెలా రేషన్ బియ్యం పంపిణీ కాగానే చిరు వ్యాపారులు తమ మోటరు సైకిల్ పై ఇల్లిల్లూ తిరుగుతూ ఒక్కో చోట ఒక్కో రేటు పెట్టి బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఉదయం సేకరించిన బియ్యాన్ని ఎవరికీ అనుమానం రాకుండా యూరియా బస్తాలో పోసి మూతకట్టి వాటిని గుట్టుగా మిల్లు యజమాని వద్దకు తరలిస్తున్నారు. మరి కొంత మంది వ్యాపారులు నేరుగా కొంత మంది రేషన దుకాణాల డీలర్లతోనే కుమ్మక్కై బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు కొంతమందిని దళారులను పెట్టుకున్నారు.
గ్రామాలు,పట్టణాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకొని పేదల ఆకలి తీర్చే బియ్యంతో వ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు. ఇలా చేసిన బియ్యాన్ని లారీల్లో లోడ్ చేసి జిల్లాల సరిహద్దుల నుంచి ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. రంగు రంగుల్లో వివిధ రకాల పేర్లతో బియ్యం పేరు పెట్టి అధిక ధరలకు రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో రూ. 8 నుంచి రూ.10 వరకు చెల్లించి సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలోకు రూ.20కి పైగా స్థానిక మార్కెట్తో పాటు ఇతర రాష్ర్టాలకు పంపి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతుంది.
కేవలం వారం పది రోజల్లోనే వందల క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే ఏమేరకు వ్యాపారం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. సంబంధిత శాఖ అధికారుల వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారులతో కుమ్మక్కు కావడంతోనే ఇలా జరుగతుందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు తప్ప స్థానిక శాఖకు సంబంధించిన అధికారులు పట్టుకోకపోవడంతో పాటు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కనీసం తనిఖీలు కూడా చేయడం లేదు. రేషన్ దుకాణాలను తనిఖీ చేసి విక్రయాలు, నిల్వలకు సంబంధించిన వ్యత్యాసాలను ఎప్పటికప్పుడు గమనించాలి, తేడా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు సదరు డీలర్పై కేసు నమోదు చేయాలి. కానీ ఎక్కడ కూడా అలా జరగడం లేదు. వ్యాపారులు, డీలర్లు అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. రేషన్ బియ్యంపై నిరంతరం నిఘా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇటీవల సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట గ్రామ పరిధిలోని శ్రీసాయిలలిత బిన్నీ రైస్మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 35 టన్నుల రేషన్ బియ్యాన్ని సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విచ్ఛలవిడిగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, ఆ మిల్లులో నిల్వ చేసినట్లు పక్కా సమాచారంతో ఆకస్మికంగా దాడులు చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుంది.
వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కోహీర్ ప్రాంతాల మీదుగా పక్క రాష్ర్టాలకు తరలిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా గుజరాత్ రాష్ర్టానికి ఎక్కువ మొత్తంలో రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు. ఈ నెల 15న గుజరాత్ రాష్ర్టానికి చెందిన లారీల్లో తరలిస్తున్న 340 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
సిద్దిపేట అర్బన్ మండలంలోని వెల్కటూరు గ్రామ శివారులో లారీల్లో అక్రమంగా 30 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.. ఇలా టాస్క్ఫోర్సు దాడుల్లో ఎక్కడో ఒక చోట రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నది.