పటాన్చెరు, మార్చి 1: పటాన్చెరు పట్టణ సమీపంలోని పటేల్గూడకు వెళ్లేదారిలో ప్రధాని మోదీ నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 5న ప్రధాని సంగారెడ్డి(కంది) నుంచి మహారాష్ట్ర అకోలా వరకు వేసిన 161 నెంబరు జాతీయ రహదారిని ప్రారంభిస్తారు. బీజేపీ జిల్లా నాయకులు పటేల్గూడ సమీపంలోని ఖాళీ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించి గ్రౌండ్ విస్తీర్ణం, భద్రతపరమైన ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు, ఇతర అంశాలను చర్చించారు.
ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరీఅంజిరెడ్డి కోరారు. శుక్రవారం పటాన్చెరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని జాతీయ రహదారిని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదేళ్లి రవీందర్, ఎడ్ల రమేశ్, జిల్లా ప్రధానకార్యదర్శి కొల్కూరు రాజశేఖర్రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాస్గుప్తా, బీజేపీ నాయకులు వర్మ, నరేశ్, ప్రసాద్ పాల్గొన్నారు.