సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలోని కర్ల గుట్టల్రెడ్డి అనే రైతు తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో మల్బరీ తోట సాగు చేస్తున్నాడు. మొదటి, రెండు పంటలకు ఎలాంటి నష్టం లేకున్నప్పటికీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వచ్చిందని చెబుతున్నాడు. మూడో పంటలో ఆశించిన మేర లాభం వచ్చిందని, ప్రస్తుతం నాలుగో పంట సాగు చేస్తున్నట్లు చెప్పాడు. పట్టుపురుగుల పెంపకం చేపడితే రైతులకు మేలు జరుగుతుందని సెరీకల్చర్ అధికారుల సూచన మేరకు జాగ్రత్తలు పాటించి అధిక లాభాలు పొందాలని ఆయన సూచిస్తున్నాడు.
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 13: ‘పట్టు’ చిక్కితే రైతుకు రెట్టింపు ఆదాయం పక్కాగా వస్తుందని ఉద్యావనశాఖ అధికారులు అంటున్నారు. సంప్రదాయ పంటలే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పట్టు పురుగుల పెంపకంపై దృష్టిసారించి లాభాలు పొందాలని సూచిస్తున్నారు. జిల్లాలోని రైతులు మల్బరీ సాగు చేపడుతూ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. రాష్ట్రంలో పట్టు పురుగుల పెంపకంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లావ్యాప్తంగా 384 మంది రైతులు సుమారు 1001 ఎకరాల్లో మల్బరీ సాగు చేపడుతున్నారు. ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఎకరా వరికి అందించే నీటిని 3 నుంచి 4 ఎకరాల మల్బరీ మొక్కలను సాగు చేసే అవకాశం ఉంది. వరితో పోల్చితే రెట్టింపు రాబడి వస్తుందని ఉద్యావనశాఖ అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలో 392 మంది రైతులు, గజ్వేల్ నియోజకవర్గంలో 180, దుబ్బాక నియోజకవర్గంలో 128, చేర్యాల పరిధిలో 113 మంది రైతులు, హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో 188 మంది రైతులు సుమారు వెయ్యికిపైగా ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని బండచెర్లపల్లి, రాఘవాపూర్, పుల్లూరు, బుస్సాపూర్ తదితర గ్రామాల్లో పట్టుపురుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు.
ఆశాజనకం…
పట్టు పురుగుల పెంపకం ద్వారా నెలనెలా ఆదాయం వస్తున్నది. 28 రోజులపాటు పట్టు పురుగుల పెంపకంతో పట్టు కాయలు తయారవుతాయి. అనంతరం రైతులు వాటిని విక్రయించి మంచి లాభాలను గడిస్తున్నారు. గుడ్ల కొనుగోలు రవాణా, కూలీల ఖర్చులు పోను లాభాన్ని గడిస్తున్నారు. ఏడాది వ్యవధిలో ఐదు సార్లు పెంపకం చేపట్టి పట్టు కాయలు విక్రయించడంతో ఆదాయం ఆశాజనకంగా వస్తోంది. అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదించి సలహాలు పొందుతున్నారు. సేంద్రియ విధానం పాటిస్తూ మల్బరీ సాగు చేపట్టి ప్రత్యేకంగా షెడ్డు నిర్మాణం చేపట్టి పట్టు పురుగులు పెంచుతున్నారు. పట్టు పురుగులకు ఆహారంగా పొలంలో సాగు చేసిన మల్బరీ ఆకును అందిస్తున్నారు. ఏడురోజులపాటు చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఆహారంగా అందిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్డులో వరుసల వారీగా పట్టు పురుగులను పెంచుతున్నారు. నిత్యం వాటిని పరిశీలిస్తూ మల్బరీ ఆకును ఆహారంగా అందిస్తూ 28 రోజులపాటు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు.
ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి…
సంప్రదాయ పంటలే కాకుండా ఆదాయం వచ్చే మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి చూపాలి. మార్కెట్లో ఒకేరకం పంట సాగుచేస్తే ఆశించిన మేర లాభం వచ్చే ఆస్కారం ఉండదు. ప్రతినెలా ఆదాయం వచ్చే వాణిజ్యపంటలు సాగు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు ఉంటే సమీపంలోని సెరీకల్చర్ అధికారులకు దరఖాస్తు అందించాలి. తగిన సలహాలు, సూచనలు పాటించాలి.
– నిమ్మ ఇంద్రసేనారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్, ఉమ్మడి మెదక్ జిల్లా