రాయపోల్,మే 2 : వ్యవసాయ బోరుబావుల వద్ద విద్యుత్ అధికారులు అప్రకటిత విద్యుత్ కోతను విధిస్తున్నారని, దీంతో తమ పంటలు చేతికి అందే సమయంలో ఎండిపోతున్నాయని వడ్డేపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు చెప్పుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అయ్యగల్ల చిరంజీవి అన్నారు. గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటి, వీరారెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు వీరాస్వామి తదితరులు కలిసి శుక్రవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కలిసి సమస్యలను వివరించారు.
వడ్డేపల్లి గ్రామ పరిసర ప్రాంత రైతులకు విద్యుత్ కోతలు లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వడ్డేపల్లి గ్రామ అభివృద్ధి కోసం సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి దశలవారీగా నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు గ్రామ మాజీ సర్పంచ్ తెలిపారు.