రాయపోల్, మార్చి 04 : రాయపోల్ మండలంలో రెండు బైకులు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తపల్లి బస్టాండ్ వద్ద సమీపంలో బుధవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మిరిదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన గంగోల్ల కుంటయ్య (55), మహమ్మద్ ఖాజా (40) బైక్ పైన గజ్వేల్కు వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ శ్రీకాంత్ రాయపోలికి వస్తుండగా.. ఇరువురి బైకులు ఢీకొన్నాయి. యాక్సిడెంట్ జరగ్గానే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. దౌల్తాబాద్ 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషన్ భాను ప్రకాష్, పైలట్ డి నర్సింహులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి.. గజ్వేల్లోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు.