ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, డిసెంబర్ 9 ; రాష్ట్రంలో మూడో శాసనసభ కొలువుదీరింది. అసెంబ్లీలో శనివారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఏడోసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా తన్నీరు హరీశ్రావు ప్రమాణ స్వీకారం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతాలక్ష్మారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేగా కొనింటి మాణిక్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్, అందోల్ ఎమ్మెల్యేగా దామోదర రాజనర్సింహా, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా జరిగిన సమావేశాల్లో శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. సిద్దిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీశ్రావు ఏడోసారి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నాల్గోసారి ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మూడోసారి, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు రెండోసారి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అందోల్ శాసన సభ్యుడు సీ.దామోదర రాజనర్మింహ, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయగా, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. —అనే నేను అంటూ శాసన సభ్యుడిగా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వారందరితో తొలి అసెంబ్లీ సమావేశంలో ప్రొటెం స్పీకర్గా వ్యవహరించిన అక్బరుద్దీన్ ఓవైసీ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ వారికి అభినందనలు తెలిపారు.