సిద్దిపేట, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఆ దిశగా రైతాంగానికి అవగాహన కల్పించాలి.. సాగు చేసేలా చూడాలి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఆయిల్పామ్ ఫార్మర్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోంరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఎండీ సురేందర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్, ఉద్యాన వన శాఖ అధికారి రామలక్ష్మి, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు నెమ్మదిగా పుంజుకున్నదని, మరింతగా సాగయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. నెలలోపు ఆయిల్పామ్ సాగు ప్లాంటేషన్ పూర్తి చేయాలని వ్యవసాయ అనుబంధ సంస్థ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 10 ఎకరాల విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులను ఏఈవో-వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో ఎంతమేర ఉన్నారో జాబితాను రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ, ఆయిల్ ఫెడ్ ప్రజాప్రతినిధులు సమన్యయంతో కలిసి పని చేయాలని చెప్పారు. ఆయిల్ ఫెడ్ బై బ్యాక్ ఒప్పందం సైతం చేసుకోవడం ఉంటుందని, 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయిల్పామ్ సాగు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధతో ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని రైతుబంధు సమితి నాయకులకు సూచించారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై అధికారులు చేపడుతున్న కార్యాచరణపై ఆరా తీశారు. గ్రామంలో ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి నాయకులు, ఆత్మ కమిటీ, పీఏసీఎస్, ఇతర వ్యవసాయ అనుబంధ సంఘాల ప్రతినిధుల సహకారంతో ఆయిల్పామ్ తోటలు సాగు చేపట్టేందుకు ముందుకొచ్చేలా రైతులను చైతన్యపరచాలని సూచించారు.
నెలలోపు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. వరి వెద సాగు, విత్తన సాగుకు జిల్లా అనుకూలం కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆయిల్పామ్ సాగు స్థితిగతుల గురించి ఏఈవోలు, ఏవోల నుంచి మంత్రి హరీశ్రావు ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా ఆయిల్ ఫెడ్ కో-ఆర్డినేటర్ ప్రవీణ్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.