సిద్దిపేట, సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో 70 ఏండ్లలో 800 మెడికల్ సీట్లు ఉంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలో 7 ఏండ్లలో 2840 సీట్లు వచ్చాయని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్లో మెడికల్ కౌన్సెలింగ్ నిపుణుడు అబ్దుల్ రబ్ ఆరీఫ్ ఆధ్వర్యంలో నీట్ కౌన్సెలింగ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. సిద్దిపేటలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, అందులో ఒకటి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ కాగా, రెండోది ప్రైవేట్ మెడికల్ కాలేజీ అన్నారు. ములుగు ఆర్వీఎంలో మరో మెడికల్ కాలేజీ ఉందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సిద్దిపేటలో బీ ఫార్మసీ కాలేజీ ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థులుకు ఎంబీబీఎస్, నర్సింగ్ విద్య అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.