సిద్దిపేట అర్బన్, జూన్ 27 : ‘మనఊరు -మనబడి’ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్లో ‘మనఊరు -మనబడి’ కార్యక్రమంపై డీఈవో, ఎంఈవోలు, టీఎస్ ఈఎంఐడీసీ ఇంజినీర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రెవెన్యూ, ఇరిగేషన్ పీఆర్, ఆర్అండ్బీ అధికారులతో పెండింగ్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ‘మనఊరు -మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించినందున బడిబాట కార్యక్రమంతో అధిక సంఖ్యలో విద్యార్థుల నమోదు జరుగుతుందని భావించామన్నారు. కానీ, గతేడాది 14 వేల మంది నమోదు కాగా, ఇప్పటివరకు 6,869 మంది విద్యార్థులు మాత్రమే చేరారన్నారు. గతేడాది కంటే తక్కువగా నమోదు కావడం బాధాకరమన్నారు. జిల్లాలో విద్యాశాఖ అధికారుల పనితీరు మెరుగుపడాలన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చూడాలన్నారు. మల్లన్నసాగర్ ఆర్అండ్ఆర్ కాలనీలో జూలై ఫస్ట్ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో పేరు వచ్చేలా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమించాలన్నారు. రూ.30 లక్షలలోపు నిధులతో చేపట్టిన పనులు త్వరగా పూర్తయ్యేలా ఆర్డీవోలు, డీఈవో, ఎంఈవో, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి..
మల్లన్నసాగర్కు సంబంధించిన భూసేకరణ నిధులు, చిన్నకోడూరు, నంగునూరు, మండలాల్లో కెనాల్స్ కోసం, భూసేకరణ నిధుల కోసం మొత్తం రూ.50 కోట్ల నిధులు త్వరలో విడుదల చేస్తామన్నారు. సంబంధిత చెక్కులను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించక ముందే చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని కెనాల్కు అవసరమైన భూసేకరణ పూర్తి కావాలని, 15 రోజుల్లో పురోగతి కనబడాలన్నారు. జిల్లాలో చెక్డ్యాం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మట్టి నిండిన కెనాల్స్ పూడికతీత పనులను ఈజీఎస్ ద్వారా చేపట్టాలన్నారు. ఎర్ర చెరువు కింద ప్లాట్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట అర్బన్ తహసీల్దార్కు చెప్పారు. దుబ్బాక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఐటీఐ, బస్టాండ్ నిర్మాణాలు వేగంగా సాగడం లేదని, సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి అవసరమైతే బ్లాక్లో పెట్టి టెండర్లను పిలవాలన్నారు. చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులు, భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, పాల్గొన్నారు.