సిద్దిపేట ప్రతినిధి/గజ్వేల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషి కారణంగానే సిద్దిపేట జిల్లాకు రైలు సౌకర్యం సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైల్వేస్టేషన్లో సోమవారం రేక్ పాయింట్ను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ నుంచి గూడ్స్రైలు 21 బోగీల్లో 1300 మెట్రిక్ టన్నుల ఎరువులతో గజ్వేల్ రేక్ పాయింట్కు చేరుకున్నది.
సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పూలు చల్లి, రైలుకు స్వాగతం పలికారు. ఎరువులు ఉన్న బోగీ వద్ద మంత్రులు రిబ్బన్ కట్ చేయడంతో ఎరువుల బస్తాలను హమాలీలు లారీల్లో ఎక్కించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేశారన్నారు. మళ్లీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ రైల్వేమార్గం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అప్పట్లో కేసీఆర్ కేంద్రమంత్రిగా రైల్వేలైన్ మంజూరు చేయించినా, అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎంలు సహకరించలేదన్నారు.
వాళ్లు రూ.ఐదారు కోట్లు మాత్రమే నిధులు కేటాయించడంతో సర్వే చేసి కాగితాలపై గీతలు గీయడానికే నిధులు సరిపోయేవన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైల్వేలైన్ ఏర్పాటుకు 2200 ఎకరాల భూసేకరణకు రూ.350 కోట్లు, రైల్వే నిర్మాణానికి ఇప్పటి వరకు రైల్వేశాఖకు మరో రూ.300 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో సనత్నగర్ రేక్ పాయింట్ ద్వారా జిల్లాలకు ఎరువులు రావాలంటే ఒక్క లారీకే గంటల సమయం పట్టేదని, దీంతో ఎరువుల సరఫరాకు ఇబ్బంది అయ్యేదన్నారు. ఇప్పుడు గజ్వేల్లోనే రేక్ పాయింట్ ఏర్పాటు చేయడంతో ఎరువుల కొరత సమస్య ఉండదని, అవసరానికి సరిపడా ఎరువులతో అదనంగా బఫర్స్టాక్ అందుబాటులో ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్, సిరిసిల్ల, నల్గొండ తదితర జిల్లాలకు ఎరువులను తక్కువ ఖర్చుతో సరఫరా చేయడానికి వీలు కలిగిందన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ రేక్ పాయింట్లను ఏర్పాట్లు చేయాలని మంత్రి నిరంజన్రెడ్డిని హరీశ్రావు కోరారు. మంగళవారం నుంచి రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడనున్నాయని తెలిపారు. రూ.7500 కోట్ల మేర డబ్బులు వేస్తామన్నారు. తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదో ప్రశ్నించాలన్నారు.
చౌకగా ఎగుమతులు, దిగుమతులు..
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పండ్లు, పాలు, కంపెనీల తయారైన పదార్థాలు, వస్తువులను దేశంలోని ఏ ప్రాంతానికైనా తక్కువ ఖర్చుతో ఎగుమతి చేసే అవకాశం ఏర్పడనున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పండిస్తున్న కూరగాయలు, పండ్లు, బియ్యం తదితర వాటిని లారీలు, డీసీఎంలు, టాటాఏస్లలో తరలిస్తున్నారు. రోడ్డు మార్గంలో ప్రస్తుతం రవాణా మరింత భారంగా మారింది. పెట్రో, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా వ్యయం పెరిగిందని భావిస్తున్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు రైలు సౌకర్యం ఎంతో ప్రయోజనకంగా మారనున్నది. ప్రస్తుతం గూడ్స్ రైలు ద్వారా ఎరువుల రవాణా ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో స్థానికంగా ఉన్న వ్యాపారులు తమ వ్యాపారాలకు అవసరమైన వస్తువులు, సరుకులు ఇతర రాష్ర్టాల నుంచి చౌకగా దిగుమతి చేసుకునే వీలు కలగనున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గజ్వేల్ ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం..
సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో పుష్కలంగా జలవనరులు ఉండడంతో పాటు కంపెనీల ఏర్పాటుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పన కోసం వర్గల్, ములుగు ప్రాంతాల్లో ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమలు, సిద్దిపేటలో ఆయిల్పామ్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయిల్పామ్ కంపెనీలతో పాటు అమూల్ లాంటి సంస్థలు తమ కంపెనీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇంకా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. గజ్వేల్కు రైల్వే సౌకర్యం ఏర్పడడంతో ఈ ప్రాంత కంపెనీలకు రవాణా మరింత చౌకగా మారనున్నది. ఇప్పటికే పలు రకాల సంస్థలు కొత్త కంపెనీల ఏర్పాటుకు భూములను కొనుగోలు చేయడానికి పరిశీలిస్తున్నాయి. గజ్వేల్ ప్రాంతంలో కావేరి, గంగాకావేరీ, ప్రసాద్ లాంటి విత్తన కంపెనీలతో పాటు మార్స్, రాణే బ్రేక్ లైనింగ్స్ కంపెనీలు, పలు రీసెర్చ్ కంపెనీలు ఉన్నాయి. రైళ్ల ప్రారంభంతో ఈ ప్రాంతంలో మరోసారి పారిశ్రామిక విప్లవం రానున్నది.
సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖల మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ములుగు మండలం వంటిమామిడి ఏఎంసీని సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కూరగాయల క్రయవిక్రయాలు, పంటల సాగు తదితర అంశాల గురించి రైతులు, కమీషన్ ఏజెంట్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమీషన్ ఏజెంట్లు రైతుల నుంచి అధికంగా కమీషన్ వసూలు చేయొద్దని, రైతులకు కనీస మద్దతు ధరలు వచ్చేలా వ్యవహరించాలని ఆదేశించారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ జహంగీర్, వైస్ చైర్మన్ భూపాల్రెడ్డి, డైరెక్టర్ బాపురెడ్డి, కార్యదర్శి రేవంత్, రైతులు, కమీషన్ ఏజెంట్లు ఉన్నారు.
గజ్వేల్ సమీకృత మార్కెట్ సందర్శన
గజ్వేల్లోని వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ను ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్తో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి సందర్శించారు. మార్కెట్ మొత్తం కలియదిరుగుతూ నిర్మాణాలను, కూరగాయలు, మాంసం, పండ్ల వ్యాపారాలను పరిశీలించారు.
సీడ్ హబ్గా గజ్వేల్: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిసింగిరెడ్డి నిరంజన్రెడ్డి
సీఎం కేసీఆర్ కృషితో గజ్వేల్ ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చాయని, ఇప్పుడు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం గజ్వేల్ రేక్ పాయింట్ ద్వారా కలుగుతుందన్నారు. ఊహించని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు వందేండ్లు ప్రజలకు మేలు కలిగేలా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర తర్వాత ప్రభుత్వ చేయూతతో సాగు పెరిగి ఎరువుల డిమాండ్ బాగా ఏర్పడిందన్నారు.
సీడ్ పాయింట్గా గజ్వేల్ అభివృద్ధి చెందుతుండడంతో ఈ ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ లావాదేవీలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్లో మరిన్ని గిడ్డంగులు వచ్చే అవకాశం ఉందన్నారు. వడ్ల కొనుగోలులో కేంద్రం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. అవసరానికి మాత్రమే వరిని పండిస్తూ, అధిక ఆదాయ పంటలను సాగు చేసి రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో ఏరులు లేని ప్రాంతానికి ఏకంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు వచ్చిందని, గజ్వేల్ ప్రాంత ప్రజలు అదృష్టవంతులని మంత్రి అన్నారు.
ఎరువులకు పైసలు తక్కువైతయి..
గజ్వేల్కు ఈ రోజు ఎరువుల సంచులతో రైలొచ్చింది. ఇక్కడికే వస్తున్నయి కదా.. దుకాణాలల్ల కూడా పైసలు తక్కువనే అయితాయి. ఇంకా అవసరం ఉన్నదాని కంటే ఎక్కువ స్టాకు ఉంచుతున్నరు. హమ్మయ్య.. యూరియాకు ఇక పరేషానే లేకుండా పోయింది.
అప్పట్లో చెప్పులు లైన్లో పెట్టేటోళ్లం
అప్పట్లో ఎరువులు కావాలంటే పోలీస్స్టేషన్ల దగ్గర, దుకాణాల దగ్గర చెప్పులు లైన్ల పెట్టేవాళ్లం. పంట వేయాలంటే పెట్టుబడికి అప్పులు దొరికేవి కానీ, ఎరువులకు మాత్రం ఎప్పుడూ కష్టపడేవాళ్లం. ఇప్పుడు రైలు సౌకర్యంతో పుష్కలంగా ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సార్లకు ధన్యవాదాలు.
– పాలేటి నరసింహ్మారావు, రైతు రిమ్మనగూడ
రవాణా ఖర్చు, సమయం ఆదా
రైలు ద్వారా గజ్వేల్కు ఎ రువులు రవాణా చేయడం తో మా వ్యాపారులకు ర వాణా ఖర్చు, సమయం ఆదా అవుతుంది. ఇక్కడే గోదాములు కూడా ఏర్పాటు చేయడంతో ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి. స్టాక్ సమయానికి రాదన్న సమస్యకు పూర్తి పరిష్కారం దొరికింది.
– రజినీకాంత్, ఎరువుల వ్యాపారి, గజ్వేల్