సిద్దిపేట, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులంతా వానకాలం సాగుపనిలో నిమగ్నమయ్యారు. రైతాంగానికి దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఎప్పటిలాగానే రైతులకు సాగుకు ముందు రైతు బంధు అందిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఎనిమిది విడతల్లో రైతులకు రైతు బంధు అందించారు. తాజాగా అందించే రైతు బంధు తొమ్మిదో విడత. నేటి ( మంగళవారం) నుంచి నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు జమ చేయడానికి వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్తగా భూముల క్రయ విక్రయాలు చేసిన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి రైతుకూ రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ఇందుకు తగ్గట్టుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 2,94,972 మంది రైతులకుగానూ రూ. 370.33 కోట్లు, మెదక్ జిల్లాలో 2,33,753 మంది రైతులకురూ. 192.90 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3.18 లక్షల మంది రైతులకు రూ. 370.74 కోట్లు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
దీంతో వానకాలం సాగుకు సైతం ఉమ్మడి జిల్లాకు రూ. 930 కోట్లు అవసరమ వుతాయి. ఆ లెక్కన డబ్బులను జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.తొమ్మిదో విడత రైతు బంధు డబ్బులను విడుదల చేస్తుండడంతో ఈ సంఖ్య కొంచెం పెరగనున్నది. గత ఎనిమిది విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 59,12,281 మంది రైతులకు రూ.6,179 కోట్ల 25 లక్షల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.సిద్దిపేట జిల్లాలో 20,08,784 మంది రైతులకు రూ. 2193 కోట్ల 41లక్షలు, మెదక్ జిల్లాలో 17,26,509 మంది రైతులకు రూ.1450 కోట్ల 2 లక్షలు, సంగారెడ్డి జిల్లాలో 21,76,988 రైతులకు రూ.2535 కోట్ల 82 లక్షలు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులను జమ చేసింది. గతంలో రైతు బంధు పడిన రైతులకు అదే ఖాతాలో పెట్టుబడి సాయం జమకానున్నది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు నేటి నుంచి రైతు బంధు తమ తమ ఖాతాల్లో పడనున్నది. కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టా పాస్ బుక్ వచ్చిన రైతుల వివరాలు తీసుకొని వారికి కూడా రైతు బంధును ప్రభుత్వం జమచేస్తుంది.
గ్రామాల వారీగా కొత్తగా పార్ట్బీ నుంచి పార్ట్ ఏలోకి వచ్చిన వారి వివరాలను సేకరించి వ్యవసాయ శాఖ పోర్టల్లో పొందుపర్చారు. డబ్బులు జమ కాగానే రైతుల సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలు అందించారు.గత శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10వేలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ప్రస్తుతం వానకాలం పంటతో వరుసగా తొమ్మిది పంటలకు రైతు బంధు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతున్నది.
సాగు పనిలో రైతులు నిమగ్నం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో రైతాంగం సాగు పనిలో నిమగ్నమయ్యారు.ఎరువులు, విత్తనాలు, దున్నకం తదితర వాటికి పెట్టుబడి సాయం అవసరం నిమిత్తం ఎప్పటి లాగానే రైతులకు ఎలాంటి చింత లేకుండా సకాలంలో రైతు బంధు అందివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రారంభించింది. రైతుబీమా పథకంతో రైతు కుటుంబాల్లో భరోసా నింపింది. సబ్సిడీపై యంత్రాలు, ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతాంగానికి మద్దతు ధరను కల్పించింది. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే బాధ తప్పడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సాగు సమయం వచ్చిందంటే చాలు పెట్టుబడిసాయం ఎట్లా అని దిగులు ఉండే ఇవ్వాళ ఆరంది లేదు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో సాఫీగా సాగు చేసుకుంటున్నారు.