గజ్వేల్, జూన్18: రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో గజ్వేల్ లాజిస్టిక్ హబ్గా మారుతోంది. గతేడాది క్రితమే గజ్వేల్కు రైలు సౌకర్యాన్ని ప్రారంభించాల్సిన ఉండగా పలు కారణాలతో ఆలస్యమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్రావు ఇటీవల రైల్వే అధికారులతో పాటు మార్కెటింగ్, ఎఫ్సీఐ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గజ్వేల్కు వెంటనే రైళ్లను ప్రారంభించాలని రైల్వే అధికారులను ఆదేశించారు. గజ్వేల్ ప్రాంతానికి రైళ్లు ప్రారంభమైతే ఇక్కడ వ్యాపారాలు, పరిశ్రమలతో పాటు అన్ని రకాల గిడ్డంగులను ఏర్పాటు చేసుకునే వీలుంది. మొదట గూడ్స్ రైళ్ల ద్వారా గజ్వేల్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు అవసరమైన ఎరువులు, బియ్యం సరఫరా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించడంతో పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే గజ్వేల్లోని మార్కెట్యార్డులో అవంతి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 5వేల మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేయడానికి గిడ్డంగులను ఏర్పాటు చేసుకోగా, 2వేల మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేసింది. ఈ నెల 20వ తేదీన కాకినాడ నుంచి గజ్వేల్కు ఎరువులతో ప్రారంభమయ్యే గూడ్స్ రైలు 22వ తేదీన గజ్వేల్కు చేరుకోనున్నది. రైల్వేసేవలు ప్రారంభంతో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, చేర్యాలతో పాటు పరిసర ప్రాంతాలకు ఎరువులు, బియ్యం, ఇతర సరుకుల రవాణాకు మరింత సౌకర్యంగా మారనున్నది. ఎరువుల గిడ్డంగుల ఏర్పాటుతో అదనపు నిల్వలు ఎల్లవేళలా ఉంచడంతో రైతులు వ్యవసాయానికి ఎరువులు దొరకవన్న భయాందోళన లేకుండా పోయింది.
మరోసారి పారిశ్రామిక విప్లవం
మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో గజ్వేల్ ప్రాంతంలో పుష్కలంగా జలవనరులు ఉండడంతో పాటు కంపెనీల ఏర్పాటుకు ఈ భూములు ఎంతో అనుకూలమైనవి. ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పన కోసం వర్గల్, ములుగు ప్రాంతాల్లో ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ అడుగులు వేస్తుండగా, ఇప్పటికే అమూల్ లాంటి సంస్థలు తమ కంపెనీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాయి. ఇంకా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. గజ్వేల్కు రైల్వే సౌకర్యం రావడంతో ఈ ప్రాంత కంపెనీలకు కూడా రవాణ మరింత చౌకగా మరనున్నది. ఇప్పటికే పలు రకాల సంస్థలు కొత్త కంపెనీల ఏర్పాటుకు భూములను కొనుగోలు చేయడానికి పరిశీలిస్తున్నారు. గజ్వేల్ ప్రాంతంలో కావేరి, గంగాకావేరీ, ప్రసాద్ లాంటి విత్తన కంపెనీలతో పాటు మార్స్, రాణే బ్రేక్ లైనింగ్స్ కంపెనీలు, పలు రీసెర్స్ కంపెనీలు కూడాఉన్నాయి. రైళ్లప్రారంభంతో గజ్వేల్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగనున్నది.
ఎగుమతులు, దిగుమతులు మరింత చౌకగా..
గజ్వేల్ ప్రాంతంలో వ్యవసాయ దిగుబడులతో పాటు పండ్లు, పాలు, కంపెనీల్లో తయారైన ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా చాలా తక్కువ ఖర్చుతో ఎగుమతి చేయడానికి అవకాశం ఏర్పడనున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పండిస్తున్న కూరగాయలు, పండ్లు, బియ్యం తదితర వాటిని లారీలు, డీసీఎంలు, టాటా ఏస్లలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్డుమార్గంలో ప్రస్తుతం రవాణా మరింత భారంగా మారింది. పెట్రో, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా వ్యయం పెరిగిందని భావిస్తున్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు రైలు సౌక ర్యం ఎంతో ప్రయోజనకంగా మారనున్నది. మరో మూడు రోజుల్లో గజ్వేల్కు గూడ్స్ రైలు ద్వారా ఎరువులు రానుండడంతో స్థానికంగా ఉన్న వ్యాపారులు తమ వ్యాపారాలకు అవరమైన వస్తువులు, సరుకులు ఇతర రాష్ర్టాల నుంచి చవకగా దిగుమతి చేసుకునే వీలు కలిగిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వ్యాపార సంస్థలు తరలివచ్చే అవకాశం
గజ్వేల్కు రైలు మార్గం ఏర్పాటుతో వివిధ వ్యాపార సంస్థలు తమ గిడ్డంగులను ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇక్కడి నుంచే ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సరుకులను చేరవేయవచ్చు. ఇప్పటికే వివిధ సంస్థల పారిశ్రామిక వేత్తలు ఇక్కడ భూములు కొనుగోలు కొనేందుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవతో రైలు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగాలు యువతకు ఎక్కువ లభించే అవకాశం కలుగుతుంది.
– వంటేరు ప్రతాప్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
చౌకగా ఎగుమతులు దిగుబడులకు అవకాశం
రైలు సౌకర్యం కావాలన్న గజ్వేల్ ప్రజల చిరకాల వాంఛ సీఎం కేసీఆర్తో నెరవేర్చుకున్నాం. గజ్వేల్ పరిసరాల్లో తయారు చేసిన ఉత్పత్తులు, రైతులు సాగు చేసిన కూరగాయలు, పండ్లు రైలు సౌకర్యంతో చాలా చౌకగా ఎగుమతి చేసే అవకాశం కలిగింది. గజ్వేల్లో పరిశ్రమల ఏర్పాటుకు కూడా రైలు సౌకర్యం ఏర్పాటుతో పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. దీంతో ఈ ప్రాంత యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందు బాటులోకి రానున్నాయి.
– మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్, గజ్వేల్
వ్యాపారులకు చాలా సౌకర్యవంతం
గజ్వేల్ ప్రాంతానికి రైలు సౌకర్యం ఏర్పాటు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. గజ్వేల్ పట్టణంలో గతం కన్నా రెట్టింపుగా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వస్త్ర, వాణిజ్య సంస్థలే కాకుండా ఇతర రంగాల వారు కూడా వారికి అవసరమైన సరుకులు, వస్తువులు తక్కువ ఖర్చుతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ప్రజలకు కూడా తక్కువ ధరకు వస్తువులను, సరుకులను అందించడానికి వీలు కలుగుతుంది.
– గోళి సంతోష్ గుప్తా, ఎరువుల, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షుడు