గజ్వేల్, జూన్ 14: ‘ధరణి పోర్టల్’తో భూరికార్డులకు భద్రత ఏర్పడిందని, భూముల వివరాలను సరళీకృతం చేయడానికి సీఎం కేసీఆర్ ‘ధరణి పోర్టల్’ ప్రవేశపెట్టారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలోని రైతువేదికలో ధరణి పోర్టల్పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రి హరీశ్రావు, సీఎస్ సోమేశ్కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ములుగు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు.
ఈ గ్రామంలో వచ్చిన 186 దరఖాస్తులను పరిశీలించి, వీలైనంత తొందరగా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు స్థానికంగానే ఉండి కృషిచేస్తారని ఆయన తెలిపారు. ధరణి పోర్టల్ 96 శాతం మందికి ప్రయోజనం చేకూర్చిందన్నారు. మిగతా 4 శాతం ధరణికి ముందున్న తప్పిదాల కారణంగా సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. వీటిలో ముఖ్యంగా ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములను దశాబ్దాలుగా దున్ని అనుభవిస్తున్న రైతులకు వారి పేరున నమోదు కాకపోవడం, ఎల్ఆర్ యూపీ దార్వా కొన్ని భూ సమస్యలు మిగిలిపోయినట్లు తెలిపారు. అలాంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు మండలంలో వందశాతం సమస్యలు పరిష్కరించి రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ములుగు తర్వాత ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని తెలిపారు. రైతులెవరూ తమ సమస్యల పరిష్కారం కోసం పైరవీకారులను ఆశ్రయించవద్దని, డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. రైతుల భూములకు వందేండ్ల వరకు కూడా పూర్తి భద్రత ఉంటుందన్నారు. ధరణి ద్వారా అనేక అక్రమాలకు చెక్ పడిందన్నారు.
భూమిపై రైతులకు పూర్తి హక్కు కల్పించబడిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ గతంలో ఎవరైనా పేర్లు, భూముల వివరాలు మార్చడానికి వీలుండేదన్నారు. కానీ, ఇప్పుడు ఖాతాదారు బొటనవేలు పెడితేనే సాధ్యమవుతుందన్నారు. ధరణితో భూరికార్డులకు భద్రత ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులో వచ్చిన 186 దరఖాస్తులను ఇక్కడే పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆ తర్వాత మండలం మొత్తం పరిష్కరిస్తామని, ఇదే పద్ధతిలో రాష్ట్రం మొత్తంలో భూసమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ధరణి సమస్యలపై అధ్యయనం,పరిష్కారంపై సమీక్ష..
అవగాహన సదస్సు అనంతరం సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధరణి పోర్టల్పై సంబంధిత శాఖల అధికారులతో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, చీఫ్ సెక్రెటరీ సోమేశ్కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు వివిధ రూపాల్లో 186, ములుగు మండలంలో 46 ఫిర్యాదులు ఉన్నట్లుగా గుర్తించినట్లు గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో సీఎంవో కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, ఐటీ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, టీఎస్ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ వెంకటేశ్వర్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ములుగు ఏఎంసీ చైర్మన్ జహంగీర్, ఎంపీపీ పెద్దబాల్ లావణ్య అంజన్గౌడ్, జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్గౌడ్, వైస్ ఎంపీపీ దేవేందర్రెడ్డి, పీఏసీఎస్, ఏఎంసీ వైస్ చైర్మన్లు నరేశ్గౌడ్, భూపాల్రెడ్డి, స్థానిక సర్పంచ్ బట్టు మాధవి అంజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.