దేశవ్యాప్తంగా 3వ ర్యాంకు
అన్నింటిలో ఈ గ్రామం ఆదర్శం
మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్, గ్రామస్తుల హర్షం
అక్కన్నపేట, జూన్ 9: వాళ్లందరిదీ ఒకేమాట.. ఒకేబాట. ఊరు చిన్నది.. ఆలోచనలు పెద్దవి.. లక్ష్యం దిశగా అడుగులు వేశారు. ఫలితంగా నేడు అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో దేశవ్యాప్తంగా ఈ గ్రామానికి 3వ ర్యాంకు లభించింది. అంతేకాదు గతంలో కూడా జిల్లాలోనే తొలి ఓడీఎఫ్ గ్రామంగా రికార్డు నెలకొల్పి, ప్రభుత్వం ప్రకటించిన నజరానాను అందుకున్నది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న చౌటపల్లికి మంత్రి హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్, గ్రామస్తులు సహా పలువురు అభినందనలు తెలుపుతూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మామూలు గ్రామం..
అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి మామూ లు గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువగా పాతకాలం నాటి పెంకుటిండ్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే గ్రామంలో కొత్త భవనాలు వెలుస్తున్నాయి. ప్రధానంగా పాడి పరిశ్రమతో పాటు ఆరుతడి పంటలు, వరి, మక్క, పత్తి, మిరప పంటలను రైతులు సాగుచేస్తారు. ఈ గ్రామంలో 526 కుటుంబాలు ఉం డగా, 376 ఇండ్లున్నాయి. 694 మంది పురుషులు ఉండగా, 734 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్యనే ఎక్కువ.
ప్రభుత్వ పథకాల అమలు.. సద్వినియోగం
ఈ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు, సద్వినియోగం వందశాతం జరుగుతున్నది. ఈ గ్రామంలో ఈ-ఆడిట్, ఓడీఎఫ్తో పాటు సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, పరిసరాల పరిశుభ్రత, ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు, హరితహారం మొక్కల నాటడం, సంరక్షణ, నర్సరీలో వివిధ రకాల మొక్కల పెంపకం, ట్యాంకర్ ద్వారా నీటి సైప్లె, డంపింగ్యార్డు, సేంద్రియ ఎరువుల తయారీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సోలార్ సిస్టం, వీధి దీపాలు,నీటిట్యాంకుల నిర్మాణంతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఫ్రైడే, డ్రైడే, పారిశుధ్యం, గ్రామ స్వచ్ఛత కార్యక్రమం, విద్యుత్ సమస్యల పరిష్కారం, పన్ను వసూలు, సేవలు, గ్రామసభలు, అవగాహన సదస్సుల నిర్వహణలో ఆదర్శంగా మారింది.
అందరి సహకారంతోనే గుర్తింపు
గ్రామస్తులందరి సహకారంతో మా గ్రామానికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా మం త్రి హరీశ్రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్కు మా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారు అన్నివిధాలా గ్రామ అభివృద్ధి సహాయ, సహకారాలు అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వంద శాతం వినియోగించుకుంటున్నాం. గ్రామానికి వివిధ అభివృద్ధి పనుల కోసం మూడేండ్లలో సుమారు రూ. 60లక్షల వరకు నిధులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఐక్యంగా పనిచేసిన గత సర్పంచ్, అప్పటి పాలకవర్గంతో పాటు ప్రస్తుత పాలకవర్గానికి, గ్రామస్తులకు నా కృతజ్ఞతలు.
– గద్దల రమేశ్, సర్పంచ్, చౌటపల్లి