సిద్దిపేట,మే 24: ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు ప్రైవేట్కు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నామని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాకేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో రేడియాలజీ ల్యాబ్ను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అత్యాధునిక ఎక్విప్మెంట్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను ఇప్పటికే ప్రారంభించుకున్నామన్నారు. మంగళవారం రేడియాలజీ ల్యాబ్ను ప్రారంభించినట్లు తెలిపారు.
త్వరలో 134 రోగ నిర్ధ్ధారణ పరీక్షలు..
ప్రస్తుతం ప్రతి పీహెచ్సీలో తెలంగాణ డయాగ్నాస్ట్టిక్ హబ్ ద్వారా 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. రాబోయే రోజుల్లో 134 రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తామని తెలిపారు. పరీక్షల కోసం వచ్చే కొంతమంది గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. అలాంటి వారికి ఈసీజీతో పాటు 2డీ ఎకో, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మామేగ్రఫీ సేవలు అవసరం కావడంతో ఈ సేవలను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లే రోగులకు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. దీనికోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ రేడియాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మరో 10 రేడియాలజీ ల్యాబ్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసేందుకు సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ఇంతకాలం ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే పరీక్షలకు బయటకు రాస్తారనే అపవాదు ఉండేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్నిరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లో చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 33 జిల్లాలో తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్లు, రేడియాలజీ ల్యాబ్లు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఏరియా, జిల్లా దవాఖానలు కాకుండా పీహెచ్సీల్లోనూ వైద్యులు రాసిన అన్ని పరీక్షలు అక్కడే చేసేలా సౌకర్యాలు కల్పించామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రోగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనవసరంగా ప్రైవేట్ ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.
గుండెపోటు బాధితులకు ‘స్టెమీ’తో సత్వర వైద్యం
ఈ మధ్య కాలంలో స్టెమీ అనే కార్యక్రమం చేపట్టామని మంత్రి హరీశ్రావు అన్నారు. దీనిద్వారా గుండెపోటుకు గురైన వారికి అత్యవసర సమయంలో వైద్యం అందించి ప్రాణాలు నిలుపుతున్నట్లు తెలిపారు. రూ.40,000 విలువ కలిగిన ఇంజెక్షన్ ఉచితంగా వేస్తున్నామన్నారు. స్టెమీ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నటు తెలిపారు. గుండెనొప్పి వచ్చి నప్పుడు ఈసీజీ, 2డీ ఎకో పరీక్ష చేసి, అవసరమైతే ఇంజక్షన్ వేసి, రోగిని స్టెబులైజ్ చేసి దగ్గరగా ఉండే దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్యసేవల గురించి ప్రజలకు తెలిపి, సద్వినియోగం చేసుకొనేలా ప్రజా ప్రతినిధులు కృషిచేయాలన్నారు.
సర్కారులో కార్పొరేట్ స్థాయి వైద్యం
పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల్లో ఎలాంటి సౌకర్యాలు, పరికరాలు ఉన్నయో, అంతకు మించి ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. గర్భిణులకు సంబంధించి అల్ట్రాసౌండ్, థిపా పరీక్షను ఉచితంగా చేస్తామన్నారు.సిద్దిపేట జిల్లా దవాఖానలో 3 అల్ట్రాసౌండ్ మిషన్లు, నలుగురు రేడియాజిస్టులు ఉన్నారని మంత్రి తెలిపారు.78శాతం మంది ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లో సేవలు వినియోగించుకుంటున్నారని, మిగతా మంది ప్రైవేట్కు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటున్నారని తెలిపారు. వైద్యులు, సిబ్బంది సైతం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరగాలన్నారు.
సీఎం కేసీఆర్ కృషితో మెడికల్ కళాశాలల ఏర్పాటు
33జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. 70 ఏండ్లలో 3 మెడికల్ కళాశాలలు వస్తే, ఏడేండ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మంచిర్యాల, రామగుండం, సంగారెడ్డి, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 700 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, నేడు 2840 సీట్లకు పెరిగాయన్నారు. ఏడేండ్లలోనే ఇన్ని సీట్లను పెంచుకున్నట్లు తెలిపారు. రాబోయే రెండేండ్లలో 5280 మెడికల్ సీట్లు ప్రభుత్వ పరిధిలో ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ కృషితో ఇవన్నీ సాధ్యమవుతున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని, దీనికోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దవాఖానలోని అత్యవసర విభాగాన్ని మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగింటి కనకరాజు, సుడా డైరక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తమిళ అరసు, సూపరింటెండెంట్ కిశోర్కుమార్, ఆర్ఎంవోలు హేమలత, చంద్రశేఖర్, డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, డీఈ విశ్వప్రసాద్, కౌన్సిలర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.