కొండపాక, మే 24 : ‘కంటి సమస్యలుంటే రంది పడొద్దు.. మీ కోసమే కంటి దవాఖాన తెచ్చిన.. సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వైద్య సేవలు, సౌలత్లు సద్వినియోగం చేసుకోవాలి.. సిద్దిపేట నియోజకవర్గంలో కాటరాక్ట్ కంటి సమస్య ఉన్నోళ్లు ఉండొద్దు అనేదే నా తపన’.. అని మంత్రి హరీశ్రావు చెప్పారు. మంగళవారం సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వచ్చిన వారిని ఒక్కొక్కరినీ మీరెక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తూ.. యోగ క్షేమాలు అడిగి ఆప్యాయంగా పలకరించారు. ఓ రోగి లచ్చవ్వ బీపీ, షుగర్ కారణంగా కంటి ఆపరేషన్ చేయలేదని మంత్రి దృష్టికి తీసుకరాగా, రంది పడొద్దు లచ్చవ్వ.. అంటూ భుజం తట్టి.. నీకు కావాల్సిన మందులు ఇప్పించి, నీకు కంటి ఆపరేషన్ చేయిస్తా.. అని భరోసా ఇచ్చారు. ఆ పక్కనే కంటి ఆపరేషన్ చేయించుకున్న వృద్ధురాలి వద్దకు వెళ్లి భుజం తట్టి ఆప్యాయతతో అవ్వ నేనెవరినీ అని ఆరా తీస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకోగా.. మా తండ్రివయ్యా.. హరీశ్రావు.. అని విఠలాపూర్కు చెందిన అవ్వ బదులిచ్చింది.
నియోజకవర్గ వ్యాప్తంగా 123 యూనిట్లు పూర్తి చేసే దిశగా 8 వేల నుంచి 10 వేల వరకూ కంటి సమస్యలతో బాధపడే రోగులు ఉన్నట్లు అంచనా ఉన్నదని, రోజూ వారీగా 15 నుంచి 20 మంది వస్తారని, వారందరికీ కంటి పరీక్షలు జరిపి కావాల్సిన ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. నిత్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా వైద్యాధికారి కాశీనాథ్కు సూచించారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 80 మంది వరకూ దవాఖానకు వస్తున్నారని, మరో ఆపరేషన్ థియేటర్ అవసరం గురించి మంత్రి దృష్టికి తేగా, ఏర్పాటు చేయించేలా చొరవ చూపాలని ఎల్వీ ప్రసాద్ మేనేజ్మెంట్ విభాగ అధిపతికి ఫోన్లైన్లో సూచించారు. ఈ మేరకు ల్యాబ్లో కంటి సమస్యలతో బాధపడే రోగులకు చేస్తున్న చికిత్స విధానం పరిశీలించారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.