సదాశివపేట, మే 26: అన్నదాత కష్టం అంతా ఇంతాకాదు. ఆరుగాలం కష్టపడి పండిస్తే మిగిలేది అంతంతమాత్రమే. ప్రారంభంలో నకిలీ విత్తనాల బెడద, పంట పెరుగుతున్న క్రమంలో చీడపురుగుల బాధ.. అందులో అకాల వర్షాలు వస్తే అంతే సంగతి. రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసినా ఒక్కోసారి పంట వర్షార్పణం కాక తప్పదు. పండిన పంట కాస్త గిట్టుబాటు ధర లేక..దళారుల మోసాలు ఇలా అన్నీ రైతులకు కష్టాలే. దీనికి తోడు ఈ ఏడాది పత్తి విత్తన కంపెనీలు ధరలు పెంచాయి. ప్యాకెట్పై రూ. 11 పెంచడంతో సంగారెడ్డి జిల్లాలో రైతులపై కోటి రూపాయలకు పైగా అదనపు భారం పడనున్నది. సంగారెడ్డి జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుకానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
ధరలు పెంచడంతో అక్రమార్కులు నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేయవచ్చు. రైతన్న తస్మాత్ జాగ్రత్త. రైతు సంక్షేమమే తమ సంక్షేమం అంటూ పాలకులు నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేస్తుంటారు. కానీ,ఆచరణకు వచ్చే సరికి పంట ఉత్పత్తుల ధర పెరగదు. కానీ, విత్తనాల ధర ఏటా పెంచుతూ రైతుల నెత్తిన గుదిబండను వేస్తున్నారు. ఏటా పత్తి విత్తన ప్యాకెట్పై ధరలు పెరగడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది పంటల సాగుకు అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగా పత్తి పంట 3.60లక్షల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు అంచనా వేశారు. పత్తి సాగు కోసం మొత్తంగా సుమారు 10లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటుంది. గతేడాది ప్రతి ప్యాకెట్పై రూ. 853 ధర ఉండేది. ప్రస్తుతం ఆ ప్యాకెట్ ధరను రూ. 864కు పెంచుతూ విత్తన కంపెనీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.
కాలంతో సంబంధం లేకుండా ఏటా పత్తి విత్తనాల కంపెనీలు విత్తన ప్యాకెట్ల ధరలను పెంచుతూ రైతులపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఎనిమిదేండ్లుగా కంపెనీలు రైతు నెత్తిన ధరల పేరుతో గుదిబండను మోపుతున్నాయి. ఒక పత్తి ప్యాకెట్పై రూ. 11 ఈ సీజన్లో అదనంగా పెరిగింది. ప్రస్తుత సాగు లెక్కల ప్రకారం ప్రతి ఎకరాకు 2 నుంచి 3 పత్తి ప్యాకెట్లు అవసరం ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం 10 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉన్నాయి. దీంతో రూ. కోటికి పైగా ఆర్థిక భారం రైతులపై పడనున్నది. ఇప్పటికే గతేడాది పంటల దిగుబడి సరిగ్గా లేక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన విషయం అందరికీ తెలిసిందే. విత్తన ధర పెంపుతో మరింత ఆర్థిక భారం పడిందని చెప్పవచ్చు.
సీజన్ ముంచుకొస్తున్న వేళ విత్తనాల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పెరిగిన ధరలను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన కంపెనీలు తక్కువ ధర పేరుతో మారుమూల పల్లెల్లోకి విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తుంటాయి. నాణ్యత లేని విత్తనాలు లేదా గుర్తింపు కంపెనీల నుంచి తయారు చేసిన విత్తనాలను కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది. రైతులు జాగత్త్రగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా పత్తి విత్తనాలే నకిలీవి అమ్ముతుంటారు. గతేడాది సదాశివపేట మండలం ఆత్మకూర్లో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి చర్యలు తీసుకున్నారు. అందుకే విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతు సంబంధిత షాప్ నుంచి బిల్లు తప్పకుండా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.