సిద్దిపేట, జనవరి 14 : క్లీన్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా అవార్డు సిద్దిపేటకు రావడం మనందరికీ గర్వకారణమని, పారిశుధ్య కార్మికులే సామాజిక వైద్యులు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. దక్షిణాదిలో సిద్దిపేటకు క్లీన్సిటీ అవార్డు వచ్చినందుకు ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు ఆంకితమన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యం సాధించలేమన్నారు.వైద్యులు రోగం వచ్చిన తర్వాత చికిత్స చేస్తే, పారిశుధ్య కార్మికులు రోగాలు రాకుండా కాపాడుతున్న సామాజిక వైద్యులు అని కొనియాడారు. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న సఫాయి అన్నలకు సలాం అని, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొకుతున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు చెత్తను బయట వేయరని, సిద్దిపేట ప్రజలు కూడా అలా ఉన్నతంగా ఆలోచించే స్థాయికి వెళ్లారన్నారు. సిద్దిపేట అంటే పందులు… చెత్త చెదారం… దుర్గంధం… దుర్వాసన… ఇది ఒకప్పటి సిద్దిపేట మాట. సిద్దిపేట ఇప్పుడు స్వచ్ఛత… పరిశుభ్రత… పచ్చదనం… సిద్దిపేట నేడు శుద్ధిపేటగా మారిందన్నారు. కేంద్రం ఏ అవార్డు ప్రకటించినా సిద్దిపేట పేరు ఉండడం గర్వంగా ఉందని హరీశ్రావు పేర్కొన్నారు.
అవార్డులు వస్తే అభినందనలు తెలుపని పరిస్థితి …
దేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా సిద్దిపేట నిలిచిందని, సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ అవార్డు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలుపని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దే వా చేశారు. రాష్ట్రంలో ఎకడ అవార్డు వచ్చినా బీఆర్ఎస్ హయాంలో పిలిచి అభినందించే సం స్కృతి ఉండేదన్నారు. 2023లో దేశంలో 4416 మున్సిపాలిటీల్లో 9వ స్థానంలో హైదరాబాద్ నిలిస్తే, దక్షిణాది నుంచి సిద్దిపేట ఫస్ట్ నిలిచిందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందన ట్వీట్, ప్రెస్నోట్ కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రశంసించకున్నా తమకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన అన్నారు.