దుబ్బాక, జూలై 15 : సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ హయాంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండలం తిమ్మాపూర్లో రూ.10 లక్షలతో బేడ బుడగ జంగాల కమ్యూనిటీ హాల్ భవనానికి ఎంపీ భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీలో ఫంక్షన్ హాల్కు రూ.15 లక్షలు, రెడ్డి భవనానికి రూ.10 లక్షలు, కుమ్మరి(శాలివాహన) సంఘానికి రూ.5 లక్షలు ఎంపీ ప్రభాకర్రెడ్డి మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాక ముందు గ్రామాల్లో తాగునీరు, మురుగు కాల్వలు, సీసీ రోడ్లు ఉండేది కావని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ప్రతి పల్లెలో ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందన్నారు.
కాళేశ్వరంతో గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించడం, రైతులకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కులమతాలకతీతంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. తెలంగాణలో పంట సాగు విపరీతంగా పెరిగిందని, ఊరూరా గ్రామ దేవతల పండుగలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు నోరు తెరిస్తే అబద్దాలనేని మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని దద్దమ్మ రఘునందన్రావు అని అన్నారు.
తొగుట మండలంలో భూనిర్వాసితులకు రూ.5 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీన్ని కూడా బీజేపీ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం నాయకులు తామంతా బీఆర్ఎస్కే మద్దతిస్తామని ప్రకటించారు. అనంతరం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఎల్లమ్మ(రేణుక మాత) ఆలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, ఏఎంసీ చైర్మన్ జ్యోతికృష్ణ, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ మాధవి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్రావు పాల్గొన్నారు.
మీ త్యాగం వెలకట్టలేనిది : ఎంపీ
తొగుట, జూలై 15 : పది మందికి మేలు చేయడం కోసం పంట పొలాలను త్యాగం చేయడం వెలకట్టలేనిదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రెండో టీఎంసీ కాల్వ కారణంగా భూమి కోల్పోతున్న మండలంలోని బండారుపల్లి, ఘనపూర్ రైతులకు సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఆయన రూ.5 లక్షల పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించిందన్నారు. కరువు కాలంలో సాగునీళ్లు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అవుతుందన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి నిధులు తీసుకురావడంలో ఇక్కడి బీజేపీ నాయకులు విఫలమయ్యారని చెప్పారు. గతంలోనే 2013 చట్టం ప్రకారం రూ.8 లక్షల చొప్పున ప్రభుత్వం భూనిర్వాసితులకు అందించిందని, అదనపు పరిహారం కోర్టు ద్వారా రావాల్సి ఉందన్నారు. ప్రభు త్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటుందని తెలిపారు. మిగిలిన రూ.5 లక్షల పరిహారం కోసం ప్రభుత్వం పూరిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాయిం ట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ సాయిబాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, వైస్ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సిరినేని గోవర్ధన్రెడ్డి, సర్పంచులు శారదారఘోతంరెడ్డి, కుంభాల వెంకటమ్మ, ఎంపీటీసీలు స్వామి, శరత్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ కలీమొద్దీన్ పాల్గొన్నారు.