Palla Rajeshwar Reddy | చేర్యాల, ఏప్రిల్ 8 : కేసీఆర్ సభకు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతం నుంచి ఉప్పెనలా ప్రజలు తరలిరావాలని, గులాబీ సైనికులు వారు సభకు వచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహాక సమావేశం పట్టణంలోని రేణుక గార్డెన్స్లో మంగళవారం జరిగింది. సన్నాహాక సమావేశానికి చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి సభకు సంబంధించిన ఏర్పాట్లు, వసతులు, రవాణ తదితర అంశాలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న రజతోత్సవ సభకు చేర్యాల ప్రాంతం నుంచి ఉప్పెనలా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరైందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు అవగాహన రాహిత్యంతో ఈ రోజు తపాస్పల్లి రిజర్వాయర్కు ఒక్క చుక్క నీరు రాలేదని దీంతో చేర్యాల ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు తెలిపారు.అసెంబ్లీ సమావేశంలో అవకాశం దక్కిన ప్రతిసారి తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీటి విడుదలతో పాటు చేర్యాల ప్రాంత సమస్యల పై తాను గళమెత్తినట్లు తెలిపారు.
ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో 2004-2014 వరకు దేవాదుల ఎత్తిపోతల పథకంలో కేవలం 40వేల ఎకరాలకు సాగు నీరు అందిందని, 2014-2023 వరకు సీఎం కేసీఆర్ 5లక్షల 14వేల ఎకరాలకు సాగునీటిని అందించారని తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ కెనాల్స్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ నాడు రూ.350కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభింపజేస్తే, నేడు కాంగ్రెస్ సర్కారు పనులను పెండింగ్లో పెట్టడడంతో తపాస్పల్లి ఎండిపోయిందని అన్నారు. దీంతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు సాగు నీరు లేక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. చేర్యాల ప్రాంత సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐక్యమత్యంగా పోరాటాలు చేసి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను నిద్రపోనివ్వలేదని చెప్పారు.
ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఊసరవెల్లి ఎమ్మెల్యే ఒకరు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నాడని, ఆంద్ర అల్లుడితో పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలను గుప్పెట్లో పెట్టుకుని బినామీల పేరిట అటవి భూములు కొనుగోలు చేస్తున్నాడని ఊసరవెల్లి ఎమ్మెల్యే ముసుగు త్వరలో తొలగిస్తామన్నారు. ఊసరవెల్లి ఎమ్మెల్యే ఆంద్ర అల్లుడితో చేయిస్తున్న అఘాయిత్యాలు, కబ్జాలు అన్ని లెక్క చేస్తున్నామని త్వరలో లెక్క తెలుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అణిచివేత, అక్రమ కేసుల నమోదుకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ నలుమూలల గులాబీ సైనికులు కొట్లాడుతున్నారని పేర్కొన్నారు. రజతోత్సవ సభకు సకాలంలో బయలుదేరి సభస్ధలికి చేరుకోవాలని, ఐక్యమత్యంగా గులాబీ శ్రేణులు దండుకట్టి తరలిరావాలని పిలుపునిచ్చారు.