సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 13: మళ్లీ సమావేశంలోపు ‘మన ఊరు -మన బడి’ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు బెజ్జంకి మండలంలో జరుగుతున్న ‘మన ఊరు -మన బడి’ పనుల పురోగతిపై అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్ పర్సన్లు, ఎంపీడీవో, ఏపీవో, ఏఈవోలు, గ్రామాల సర్పంచ్లు, కాంట్రాక్టర్తో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ‘మన ఊరు- మన బడి’ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇంకా బెజ్జంకి మండలం మెరుగుపడాలన్నారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీటి వసతి, మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేశాకే.. మిగతా పనులు చేయాలన్నారు. కిచెన్ షెడ్, ప్రహరీ, అదనపు తరగతి గదులు, ఈజీఎస్ కింద చేపట్టిన పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎంపీడీవో, ఎంపీవోలు రోజు వారీగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించాలన్నారు. ఏఈలు ఇప్పటి వరకు అయిన పనులకు ఎఫ్టీవో జనరేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఈవో, ఎంపీడీవో, ఏఈలు, నిర్మాణ ఏజెన్సీలను సమన్వయపర్చి పనులు పూర్తి చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో మెడికల కాలేజీ బోధన దవాఖాన నిర్మాణ పనులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం డీఎంఈ రమేశ్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు దవాఖాన పనులను పరిశీలించామన్నారు. దవాఖాన నిర్మాణంపై కొన్ని సూచనలు చేశామన్నారు.నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. టీఎస్ ఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్కు మ్యాపును చూపిస్తూ దవాఖాన నిర్మాణ పనులను వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ పనుల్లో లోపాలు లేకుండా చేయాలని కలెక్టర్ సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొ న్నారు. అందుకు ఆనుగుణంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలన్నారు. మెడికల కాలేజీ బోధన దవాఖాన చుట్టూ కంపౌడ్వాల్ నిర్మించాలన్నారు. పారామెడికల్, అటెండర్ షెడ్ బిల్డింగ్కు సంబంధించి రెండు రోజుల్లోగా ప్రణాళిక రూపొందించాలన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విమలాథామస్, ఈఈ శ్రీనివాస్, డీఈ విశ్వప్రసాద్, మంత్రి ఓఎస్డీ బాలరాజు పాల్గొన్నారు.