హుస్నాబాద్, మే 18 : శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి కృపతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయి త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎన్నో మహిమలు కలిగిన అమ్మవారిగా భక్తులకు నిత్యదర్శనం ఇస్తున్న ఎల్లమ్మ దేవత నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.
బుధవారం రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. రెండోసారి ఆలయ పాలకవర్గ సభ్యులుగా నియామకం అయిన పూదరి రవీందర్గౌడ్ తదితరులకు నియామక పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు.
ఆలయ ఆవరణలో వెలసిన జాయింట్ వీల్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, సభ్యులు గడిపె కొంరయ్య, పున్న సారయ్య, దొంతరబోయిన శ్రీనివాస్, శివ, ఈవో విశ్వనాథశర్మ, పూజారి పరమేశ్వరశర్మ, సిబ్బంది కుమార్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.