సిద్దిపేట, అక్టోబర్ 25 : ప్రజావాణిలో వచ్చే ధరణి ఆర్జీలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన పరిష్కారం చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి పెండింగ్ అప్లికేషన్ల పరిష్కార పురోగతికి ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ మినహా వివిధ ప్రభుత్వ శాఖలకు వస్తున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారించి వెంటనే పరిష్కరించాలన్నారు. అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని స్పష్టం చేశారు.
భూసమస్యలు, ఇతర సమస్యలు పరిష్కారం కోరుతూ 57 ఫిర్యాదులు వచ్చాయని, వచ్చిన ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలన్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాట సర్పంచు కొమ్మెర పూజిత 50 మంది గ్రామ ప్రజలతో కలిసి తమ గ్రామంలో కొంత ప్రభుత్వ భూమి ఉందని దానిని పేదలకు పంపిణీ చేయాలని కోరారు.
గ్రామంలో లభ్యత కలిగిన ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో ఆర్డీవో, సర్వేయర్లు గుర్తించాలన్నారు. ఆ భూమిని ప్రజలకు పంపిణీ చేయడం సాధ్యం కాదని ప్రజా అవసరాలకు మాత్రమే వాడుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రపుల్దేశాయి, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, డీఎఫ్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.