సిద్దిపేట: కొండపోచమ్మ సాగర్ జలాశయం నిర్వాసితుల కోసం నూతనంగా నిర్మించిన తునికి బొల్లారం పీఅండ్ఆర్ కాలనీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సందర్శించారు. కాలనీలోని మౌలిక సదుపాయాలు, ఇండ్లను పరిశీలించారు. కాలనీలో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని, కాలనీ లే అవుట్, అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని సీఎస్ సంతృప్తి వ్యక్తంచేశారు. దేశంలోనే అత్యుత్తమ కాలనీగా తునికి బొల్లారం పీ అండ్ ఆర్ కాలనీ నిలుస్తుందన్నారు. భూ నిర్వాసితులతో సీఎస్ మాట్లాడారు. కాలనీలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను గురించి సీఎస్కు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి వివరించారు.
కాగా, ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో భూ నిర్వాసితుల కోసం అత్యుత్తమ కాలనీని నిర్మిస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చారు నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని వసతులతో కాలనీని నిర్మించారని చెప్పారు. సీఎస్ వెంట రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి ఉన్నారు.