చేర్యాల, మే 9 : చేర్యాల పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రభుత్వం జూనియర్ కళాశాలగా ఆప్గ్రేడ్ చేసినట్లు ఎంఈవో ఎం.నర్సింహరెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి నజియా సల్మా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీ జూనియర్ కళాశాల(ఇంగ్లీష్ మీడియం)గా మారుతున్నట్లు తెలిపారు.
రానున్న విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు. ఫస్ట్ ఇయర్లో సీఈసీ, ఎంపీహెచ్(మల్టీపర్సప్ హెల్త్ వర్కర్) కోర్సులను ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 7వ తేదీన జిల్లా చైల్డ్ డెవలఫ్మెంట్ అధికారి ముక్తేశ్వరి కేజీబీవీని సందర్శించి వసతులను పరిశీలించి డీఈవోకు నివేదిక అందజేయడంతో కళాశాల ప్రారంభించేందుకు డీఈవో అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
ఇక ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియల్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధునిక భవన సముదాయంతో పాటు విశాలమైన ఆటస్థలం, హాస్టల్ వసతి ఉన్న కేజీబీవీలో ఉత్తమ బోధన చేసేందుకు అనుభవం కలిగిన సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
కేజీబీవీ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఆడ్మిషన్ పొందిన బాలికలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫామ్స్, హెల్త్కిట్స్ను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ఆడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తిగల విద్యార్ధులకు అడ్మిషన్ల కోసం 7680946704 సంప్రదించాలన్నారు.