సిద్దిపేట : జనవరి 7,8 వ తేదీల్లో జరుగనున్న కొమురవెల్లి ( Komuravelli ) మల్లికార్జున స్వామి కళ్యాణమహోత్సవం, జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ( Minister Konda Surekha) అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేటలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. లక్షలాధిమంది తరలివచ్చే జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాట్లు మాత్రమే చేస్తుండగా శాశ్వత (Permanent ) ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపితే వచ్చే బడ్జెట్లో ( Budget ) నిధులను కేటాయిస్తామని పేర్కొన్నారు. కొమురవెల్లి లో శాశ్వత ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర మొత్తం పూర్తయ్యే వరకు గట్టి పోలీస్ బందోబస్తు (Police Security) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆర్టీసీ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బ్యాటరీ వాహనాలు నడిపించాలని కోరారు. మహిళలు, వృద్ధులు, గర్భిణులు, పిల్లల కోసం ప్రత్యేక దర్శన లైన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతర పూర్తయ్యే వరకు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి అత్యవసర మందులను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అన్నారు. అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా బెల్ట్ షాపులను మూసివేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అదనపు డీసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.