సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 14: వ్యవసాయశాఖలోని గ్రౌండ్ లెవెల్ సిబ్బంది సహాయంతో ఫిబ్రవరి నాటికి అన్ని బ్యాంకులు లక్ష్యాన్ని సాధించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కన్సటెన్సీ కమిటీ(డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ(డీఎల్ఆర్సీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రూ.5,920 కోట్ల లక్ష్యానికి రూ.4,305 కోట్లతో 73 శాతం వ్యాపారం సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు.
పశుసంవర్ధక, మత్స్యపరిశ్రమ కింద కిసాన్ క్రెడిట్ కార్డులు బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తారన్నారు. నాబార్డులో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం ఉందని.. అర్హులైన లబ్ధిదారులందరికీ 6 శాతం వడ్డీతో సెక్యూరిటీ లేకుండా రూ.2 కోట్ల రుణం లభిస్తుందన్నారు. ఎస్హెచ్జీ గ్రూపు రుణాల లక్ష్యాలను ఫిబ్రవరి 2024 నాటికి పూర్తి చేయాలని, అన్ని బ్యాంకుల అధికారులను అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ ఆదేశించారు. సమావేశంలో సిద్దిపేట డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, ఇతర శాఖల అధికారులు, బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.