గజ్వేల్ రూరల్, జూలై 5: “అభివృద్ధి అంటే ఏమిటో హైదరాబాద్లో కూర్చొని చూస్తే కనిపించదు. గ్రామాల్లోకి వచ్చి చూస్తే మేము చేసిన అభివృద్ధి కండ్లకు కనిపిస్తది.” అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని అహ్మదీపూర్లో రూ.6.25 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం డబుల్బెడ్ రూం ఇండ్ల వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ హయాంలో కాలిన ట్రాన్స్ఫార్మర్లు, ఎండిన పొలాలు, తాగునీటి సమస్యలు కనిపించేవని, నేడు గ్రామాల్లో ఇంటింటికీ భగీరథ నీళ్లు, వేసవిలోనూ కూడవెళ్లిలో కాళేశ్వరం జలాల ప్రవాహం, 24 గంటల ఉచిత కరెంట్ను విజయవంతంగా రైతులకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
తెలంగాణలోని రైతాంగానికి కేసీఆర్ అనే భరోసా లభించిందన్నారు. కరెంట్ లేకుండా కాలువల ద్వారా నీటిని రైతులకు అందించే సమయం దగ్గర్లోనే ఉందని, మరోనెల రోజుల్లోనే మీ నెత్తిమీద ఉన్న మల్లన్నసాగర్ను కాళేశ్వరం జలాలతో నింపుతామన్నారు. తెలంగాణ రావడం సీఎంగా కేసీఆర్ కావడంతో అహ్మదీపూర్ దశదిశ మారిందన్నారు. కాలువల నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అందుకు అందరూ సహకరించి చిన్న కాలువను నిర్మించుకోవాలన్నారు. ఈసారి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయడంతో గ్రామంలోని 500 ఎకరాల్లో సాగుచేసిన వరిపంట గట్టెక్కిందన్నారు. ఏడాదిలో రెండు సార్లు సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడిసాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామన్నారు. అహ్మదీపూర్కి మరో 100 ఇండ్లు, కొల్గూర్ వరకు డబుల్ రోడ్డు, కుల సంఘాలకు భవనాలు, అర్హులై వారందరికీ పింఛన్లు త్వరలోనే అందజేస్తామన్నారు.
అహ్మదీపూర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి…
అందరూ సంఘటితంగా ఉండి అహ్మదీపూర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి హరీశ్రావు అన్నారు. మీ గ్రామంలోని యువకులు రాష్ట్ర సాధనలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారని అందుకు మీ గ్రామానికి ఎంత చేసినా తక్కువేనన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్ కోరినట్లు గ్రామానికి అవసరమైన భవన నిర్మాణాలు, డబుల్రోడ్డు, మరో వంద ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డబుల్బెడ్ రూం ఇండ్లను ప్రారంభం సందర్భంగా గ్రామస్తులతో కలిసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొని ఇంటి యజమానులకు మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్, ఆర్డీవో విజయేందర్రెడ్డి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ నవీనాశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, నాయకులు యాదవరెడ్డి, రవీందర్రావు, మధు, చంద్రమోహన్రెడ్డి, చాడా విష్ణువర్ధన్రెడ్డి, రమేశ్గౌడ్, అహ్మద్, నిజాం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు ఆర్థిక పుష్టి..
సిద్దిపేట, జూలై 5: ఇప్పటి వరకు చేపలను దిగుమతి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మంత్రి నివాసంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ సంచార వాహనాన్ని ప్రారంభించి సిద్దిపేట సొసైటీ లబ్ధిదారు, మహిళా మత్స్యపారిశ్రామిక సంఘ సభ్యులు కాముని భాగ్యమ్మ తదితరులకు వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు బాసటగా ఈ వాహనాలు ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో త్వరలోనే చేపల సంచార వాహనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు.
మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ సంచార వాహనంలో ఓవెన్, వెయింగ్ మిషన్, ప్యాబ్రికేట్ చేసిన గ్యాస్ స్టౌ, ట్రేలు పూర్తిస్థాయిలో ఆధునిక పద్ధతిలో సామగ్రిని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. మహిళా మత్స్య పారిశ్రామిక సభ్యులకు హైదరాబాద్లో సంచార వాహనాల విక్రయాలపై శిక్షణ ఇప్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. సిద్దిపేట సొసైటీకి మరో 2 యూనిట్లు ఉన్నాయని, అవసరమున్న మత్స్యకార ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, సుడా డైరెక్టర్ మచ్చ వేణు, నాయకులు ఊదర మణిదీప్రెడ్డి తదితరులు ఉన్నారు.