రామచంద్రాపురం, జనవరి 23: అగ్రరాజ్యమైన అమెరికాలోని చికాగోలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థితో పాటు మరొకరు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఎల్ఐజీ కాలనీలోని ఇంటి నంబర్ 248లో నివాసం ఉండే కొప్పాల శ్రీనివాస్రావు కుమారుడు కొప్పాల సాయిచరణ్ ఎంఎస్ చదువుకోవడానికి ఈ నెల 11వ తేదీన అమెరికా వెళ్లాడు. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.
సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సాయిచరణ్ స్నేహితులు శ్రీనివాస్రావుకి ఫోన్ చేసి నల్లజాతీయులు కాల్పులు జరపడంతో సాయిచరణ్ శరీరంలోకి బుల్లెట్ దూసుకువెళ్లిందని, సాయికి చికాగో మెడికల్ సెంటర్లో చికిత్స జరుగుతుందని సమాచారం అందించారు. దీంతో సాయి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్నేహితులు ఫోన్ చేసి సాయికి ఔట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు చెప్పినట్లు శ్రీనివాస్రావు మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం మెడికల్ సెంటర్లోనే సాయికి చికిత్స అందిస్తున్నారు. ఎన్నో ఆశలతో కొడుకుని అమెరికాకు పంపితే వెళ్లిన పది రోజుల్లోనే తమ బిడ్డ ఇలా ప్రమాదానికి గురికావడం చాలా బాధ కలిగిస్తుందని కుటుంబీకులు రోదిస్తున్నారు. తమ కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకారం అందించాలని సాయిచరణ్ తల్లిదండ్రులు శ్రీనివాస్రావు, లక్ష్మి కోరుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.