హుస్నాబాద్, మార్చి 12: హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, కళాశాలను త్వరలోనే కొత్త భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హుస్నాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు ఎల్లమ్మ చెరువు కట్టను ఆయన పరిశీలించారు. అనంతరం హన్మకొండ రోడ్డులో మెడికల్ కళాశాల కోసం ప్రతిపాదించిన 30ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త భవనంలోకి మారడానికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ, తాగునీరుతో పాటు ఇతర సౌకర్యాల వివరాలు పంపాలని ప్రిన్సిపాల్ భిక్షపతిని ఆదేశించారు. కళాశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవనాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భవన నిర్మాణ పనులు పూర్తయినందున వెంటనే కళాశాల నిర్వహణ ఇక్కడికి మార్చాలన్నారు. ఎల్లమ్మ చెరువు విస్తీర్ణం, ఆయకట్టు వివరాలను నీటిపారుదల శాఖ ఈఈ రాములునాయక్ను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చేయాల్సిన పనులు, కావాల్సిన నిధులను అంచనా వేసి పంపాలని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ విద్యాసాగర్ను ఆదేశించారు. మెడికల్ కళాశాల కోసం ప్రతిపాదించిన స్థలం వివరాలను సత్వరంగా పంపాలన్నారు. కలెక్టర్ వెంట ఇంజినీరింగ్ అధికారులతో పాటు తహసీల్దార్ రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు.