ములుగు, మార్చి 25: ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.36లక్షలను సీజ్ చేసి గ్రీవెన్స్ సెల్లో డిపాజిట్ చేసినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి చెక్పోస్టును ఆయన పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు గానీ, మద్యం గానీ రవాణా చేయకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. విధులు నిర్వహించే సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు రూ.50వేలకు మించి డబ్బులను వాహనాల్లో తీసుకొని వెళ్లరాదన్నారు. ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్తే వాటికి సంబంధించిన పత్రాలను దగ్గరే ఉంచుకోవాలని, లేనియెడల డబ్బులను సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తామని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాహన తనిఖీలకు సహకరించాలని కోరారు.