మెదక్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమదృష్టితో అమలు చేస్తూ 70 ఏండ్లలో సాధించని ప్రగతిని, 9 ఏండ్లలో చేసి చూపించిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందిందని, ఇది సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మాయా గార్డెన్లో సంక్షేమ సంబురాలు నిర్వహించారు. అతిథులను బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో లాంఛనంగా 20 మంది బీసీలకు రూ.లక్ష చొప్పున చెకులు అందజేశారు. రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించి 24 మందికి మంజూరు ఉత్తర్వులు అందజేశారు. 21 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెకులు, పేరూరు, హవేళీఘనపూర్, రాంపూర్ గ్రామాలకు చెందిన 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, పైలేరియా, డయాలసిస్ రోగులకూ పింఛను ఇస్తున్నారని తెలిపారు.
విద్యారంగ బలోపేతానికి గురుకుల పాఠశాలలు, విదేశ విద్యకు రూ.20 లక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతాంగానికి రైతు బంధు, రైతు బీమా, సాగునీటికి చెక్ డ్యాంల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత, పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు. దళితులకు దళిత బంధు అమలు చేసినట్లే బీసీ కులవృత్తులు, చేతివృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నియోజక వర్గంలో 9,693 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులు, 50 వేల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. సొంత జాగా ఉన్న వారికి ఈ నెల 16 నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఎంపీపీ జమునా జయరాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, డీఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి విజయశేఖర్రెడ్డి, బీసీ అభివృద్ధి అధికారి శంకర్, మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని ఆకాంక్షించి అనేక పథకాలకు రూపకల్పన చేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాలోని అర్హులైన బీసీ కుల, చేతివృత్తుల వారు ఈ నెల 20 వరకు రూ.లక్ష కోసం దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 55 ఏండ్లలోపు వయస్సున్న, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సాయం కుటుంబంలోని ఒకరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. ఐదేండ్లలోపు ప్రభుత్వ శాఖల ద్వారా ఆర్థిక లబ్ధి పొందినా, 2017-18లో రూ.50 వేలు పొందిన వారు ఈ సాయానికి అనర్హులన్నారు.
మెదక్ నియోజకవర్గంలో 20 మందికి, నర్సాపూర్ నియోజకవర్గంలో 14 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి చెకులు అందజేశారన్నారు. గొల్ల కుర్మల ఆర్థిక బలోపేతానికి జిల్లాలో మొదటి విడతగా గొర్ల అభివృద్ధి పథకం కింద 12,997 మందికి గొర్రెలు పంపిణీ చేశారన్నారు. రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మెదక్ 24 మందికి, నర్సాపూర్లో 44 మందికి మంజూరు ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. మెదక్ మండలం పేరూర్, హవేళీఘనపూర్, నిజాంపేట మండలాల్లో 82 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నెల్లూరు, హస్తాల్పూర్, ఏదులపల్లిలో 85 మందికి ఇళ్ల పట్టాలు అందజేసినట్లు తెలిపారు.