సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 3: మారుతున్న కాలానికనుగుణంగా విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్, 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానికి ప్రదర్శన-2022 ముగింపు కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్రావు, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి జడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడారు. ఎంతో కష్టపడి వివిధ రకాల ఎగ్జిబిట్లను మూడు రోజుల పాటు ప్రదర్శించి, వారి నైపుణ్యతను ప్రదర్శించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రదర్శించి జిల్లాకు బహుమతులు తీసుకురావాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మార్పునకు అనుగుణంగా మన నేర్చుకునే విద్యా అలవాట్లు కూడా మారాయని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ విద్యలో సైతం చాలా మార్పులు రావడం శుభపరిణామని తెలిపారు. పునాది గట్టిగా ఉంటేనే భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని తెచ్చిందన్నారు. మీలో పుట్టే ఆలోచనే ఆవిష్కరణగా మారుతుందని, అలాంటి ఆలోచనలు రావడానికే విద్య అవసరమన్నారు. మూడు రోజుల పాటు అద్భుతంగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు, మీకు సహకరించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. విజేతలకు జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే, విద్యాశాఖ అధికారులు బహుమతులు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, స్థానిక కౌన్సిలర్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
సైన్స్ ఫెయిర్లో జిల్లా వ్యాప్తంగా 178 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో నుంచి 17 అంశాలను ఎంపిక చేశారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఏడు విభాగాల నుంచి 160 ఎగ్జిబిట్లను ప్రదర్శించగా, అందులో నుంచి సీనియర్, జూనియర్ కేటగిరీలో 14 మంది విద్యార్థులు, టీచర్ ఎగ్జిబిట్ నుంచి ఒక అంశానికి అవార్డు లభించింది. ఇన్స్పైర్ మానక్లో రెస్క్యూ మిషన్, సైకిల్ డస్టర్ స్ప్రే యింగ్ మిషన్,స్పెషల్ స్పెక్టాకిల్స్ ఫర్ బ్లైండ్, జనతా వా షింగ్ మిషన్, ఆండ్రాయిడ్ మొబైల్ కంట్రోల్డ్ వాయిస్ గైడర్), సోలార్ పవర్డ్ వాటర్ ప్యూరిఫయర్, ఆటోమెటిక్ ఫెర్టిలైజర్ స్ప్రే, మోడ్రన్ పార్కింగ్ సిస్టమ్, ఫార్మర్ సే వింగ్ స్టిక్, బయో ప్లాస్టిక్ ఫ్రమ్ స్టార్చ్, ప్రివెంట్ ఆటోమెటి క్ రోడ్ ఆక్సిడెంట్, ఆటో మాస్క్, హెర్బల్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ టూ కుకింగ్ గ్యాస్, రోల్ ఆఫ్ అలారమ్ ఇన్ క్రాప్ ప్రొటెక్షన్, ఆటోమెటెడ్ పారాలిసిస్ పేషెంట్ హెల్త్ కేర్ సిస్టమ్, ఆల్కహాల్ సెన్సింగ్ స్మార్ట్ హెల్మెట్ ఎగ్జిబ్లి ఎంపికయ్యాయి.
వైజ్ఞానిక ప్రదర్శన-2022లో అడ్వాన్స్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో సీనియర్ కేటగిరీలో దుబ్బాక పాఠశాలకు చెందిన ఎం.మనీష్, జూనియర్ కేటగిరీలో రాఘవేంద్ర టాలెంట్ స్కూల్, కొండపాకకు చెందిన సాయి హర్షిత్, ఎకో ఫ్రెండ్లీ విభాగం సీనియర్ కేటగిరీలో సిద్దిపేట అర్బన్ మండలం టీఎస్ఆర్ఎస్జేసీకి చెందిన స్వాతి, జూనియర్ కేటగిరీలో సిద్దిపేట అర్బన్ ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన కే.ఝాన్సీ, హెల్త్ అండ్ క్లీన్లీనెస్ విభాగం సీనియర్ కేటగిరీలో జడ్పీహెచ్ అల్లీపూర్కు చందిన టీ.చైతన్య చరణ్, జూనియర్ కేటగిరిలో ప్రాథమికోన్నత పాఠశాల వెంకటాపూర్కు చెందిన పవన్ యాదవ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్ విభాగం సీనియర్ కేటగిరీలో జడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్కు చెందిన కే.నమృత్, జూనియర్ కేటగిరీలో ప్రాథమికోన్నత పాఠశాల కాళ్లకుంట కాలనీకి చెందిన భానుతేజ, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ విభాగం సీనియర్ కేటగిరీలో టీఎస్డబ్ల్యూఆర్ఎస్, కోహెడకు చెందిన వీ.అర్జున్, జూనియర్ కేటగిరీలో టీఎస్ఎంఎస్ గజ్వేల్కు చెందిన ఏ.వెన్నెల, హిస్టారికల్ డెవలెప్మెంట్ విత్ కరెంట్ ఇన్నోవేషన్ విభాగం సీనియర్ కేటగిరీలో జడ్పీహెచ్ఎస్ చిన్నకిష్టాపూర్కు చెందిన ఎస్. బికేశ్, జూనియర్ కేటగిరీలో జడ్పీహెచ్ అహ్మదీపూర్కు చెందిన వీ.పూజ, మాథమెటిక్స్ ఫర్ అజ్ విభాగం సీనియర్ కేటగిరీలో జడ్పీహెచ్ఎస్ కొండపాకు చెందిన అలేఖ్య, జూనియర్ కేటగిరిలో యూపీఎస్ చందాపూర్కు చెందిన శరణ్య, టీచర్ ఎగ్జిబిట్లో కొండపాక మండలం సిరిసినగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన రూపారాణి బహుమతులు గెలుచుకున్నారు.
ఆట, పాటల ద్వారా భౌతికంగా గణితాన్ని విద్యార్థులకు నేర్పించవచ్చనే ఉద్దేశంతో 5 రకాల మెథడ్లను ఎగ్జిబిట్లో ప్రదర్శిస్తున్నట్లు కొండపాక మండలం సిర్సినగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయురాలు రూపారాణి తెలిపారు. నిత్య జీవితంలో పిల్లలు ఆడుకునే చార్ పత్త, టక్కర్ మార్ ప్లాట్ ఏ పాయింట్, ఎరితోస్తనీస్ సీవ్, నెంబర్ లైన్ అనే ఆటల పేర్ల ద్వారా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు గణితాన్ని సులభ పద్ధతిలో నేర్పించవచ్చని ఆమె వివరించారు. ఇలా చేయడం ద్వారా జీవితాంతం గణితాన్ని మర్చిపోయే అవకాశం ఉండదని రూపారాణి తెలిపారు. ఈ ఎగ్జిబిట్కు గానూ రూపారాణికు టీచర్ విభాగంలో బహుమతి లభించింది.
ఎగ్జిబిట్ టీచర్: రూపారాణి, జడ్పీహెచ్ఎస్, సిర్సినగండ్ల
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని వంద శాతం బతికించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అనివార్య కారణాలతో మనం నాటిన మొక్కలకు నీరు పోయలేని పరిస్థితుల్లో ఒక డ్రమ్ము కానీ, ఇతర డబ్బా సహాయంతో ఒకసారి నింపి కొన్ని రోజుల వరకు మొక్కలు ఎండిపోకుండా.. మనిషి ప్రమేయం లేకుండా నీళ్లు పోసే విధంగా ‘విక్ వాటర్ సిస్టమ్’ ప్రయోగంతో కేశనాళికీయత అనే సూత్రం ద్వారా విక్ పద్ధతిలో నీటి బిందువులకు మొక్కలకు పంపియ్యవచ్చని విద్యార్థులు కావేరి, గిరిధర్రెడ్డి వివరించారు. ఆరుబయటనే కాకుండా ఇంట్లో, ఆఫీస్లో ఇలాంటి పద్ధతిని ఉపయోగించి మొక్కలు పెంచవచ్చని వారు తెలిపారు. తమ గైడ్ టీచర్ పి.రజిత సహకారంతో ఒక మోడల్ హౌస్ బిల్డింగ్, వాటర్ ట్యాంక్, కాటర్ రోప్స్ల సహాయంతో ఈ ఎగ్జిబిట్ను తయారు చేశామని వారు తెలిపారు.
ఆవిష్కర్తలు: జే.కావేరి, జి.గిరిధర్రెడ్డి (జడ్బీహెచ్ఎస్, సికింద్లాపూర్)
మురికి మళినాలు, ఇతర హానికరమైన కణాలను, రసాయనాలను తొలిగించి నీటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించినట్లు విద్యార్థిని బీ. రచన వివరించింది. సెడిమెంట్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, ఆర్వో సహాయంతో ఈ ఎగ్జిబిట్ను తయారు చేశామని, కార్బన్ ఫిల్టర్లో నీటిలో ఉన్న దుర్వాసన తొలిగించి, నీటికి మంచి వాసన, రుచి అందించబడుతుందని వారు తెలిపారు. అనంతరం ఆర్వోలో ఉన్న పైపు చుట్టూ నాలుగు నుంచి ఐదు మెంబ్రేన్ల నీటి బిందువులు మాత్రమే వెళ్లి నీరు శుద్ధిగా మారుతాయన్నారు. అలాగే కాపర్ ఫిల్టర్ ద్వారా ఆర్వోలో తొలిగించబడ్డ మినరల్స్, జింక్, కాపర్, ఐరన్ లాంటివి తిరిగి చేర్చబడి నీరు పూర్తిగా శుద్ధి చేయబడతాయని తెలిపారు. ఫిల్టర్ల సాయంతో శుద్ధ నీటిని అందించేందుకు గానూ తన గైడ్ టీచర్ చంద్రప్రసాద్ సహకారంతో ఈ వాటర్ ప్యూరిఫయర్ను తయారు చేసినట్లు రచన తెలిపారు.
ఆవిష్కర్త: బీ.రచన, జడ్పీహెచ్ఎస్, సికింద్లాపూర్