సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 8 : ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు తమ మేదస్సుకు పదును పెట్టారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో తమదైన రీతిలో ఎగ్జిబిట్లు ప్రదర్శించి ఔరా అనిపించారు. సంగారెడ్డిలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా గురువారం జిల్లాలోని 39 పాఠశాలల నుంచి 3,500 మంది విద్యార్థులు ప్రదర్శనలు తిలకించేందుకు వచ్చారు. ఆయా ఎగ్జిబిట్లను తిలకించిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఇన్స్పెయిర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్కు సంబంధించి 81 ప్రాజెక్టులు ప్రదర్శించగా, జేఎన్ఎన్ఎస్ఎంఈఈకు సంబంధించి 409 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఒక్కో విద్యార్థి ఒక్కో ఉప అంశాన్ని సందర్శకులకు చక్కగా వివరించారు.
న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టులను ఎంపిక చేసేందుకు ఆయా ప్రదర్శనలను క్షుణ్ణంగా పరిశీలించారు. సైన్స్ ప్రదర్శన చివరి రోజు విజేతలను వారు ప్రకటించనున్నారు. ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకులు ఉమా, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గౌహతి నుంతి జాతీయ పరిశీలకులు స్వరాజ్ ఫరీజ్ ఆయా ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, నోడల్ అధికారి లింబాజీ, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్, సైన్స్ఫెయిర్ కన్వీనర్గా జాకీర్ హుస్సేన్, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వై అశోక్ కుమార్, సయ్యద్ సాబేర్ అలీ, రాంచందర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మహిళా సంరక్షణ ఛేదనం
ఆవిష్కర్త : దీపిక
పాఠశాల పేరు : త్రివేణి పాఠశాల, ఇస్నాపూర్, పటాన్చెరు మండలం
వివరణ : మహిళలకు రక్షణ లేకుండా పోతున్న నేటి సమాజంలో ఉమెన్ సేఫ్టీ ట్రాకర్ ఎగ్జిబిట్ను ప్రదర్శించింది. మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పు డు ఈ పరికరాన్ని బటన్ నొక్కితే చాలు ఆమె ఎక్కడ ఉందో తెలిసిపోవడం ద్వారా తనను రక్షించేందుకు వీలుపడే అవకాశం ఉంటుంది.
మ్యాన్ హోల్ సేఫ్టీ సెన్సార్
ఆవిష్కర్త : నవదీప్
పాఠశాల పేరు : న్యాల్కల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్
వివరణ : రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులు మ్యాన్హోల్ వద్దకు రాగానే సెన్సార్ ద్వారా అలెర్ట్ చేస్తుంది. ఒకవేళ మ్యాన్ హో ల్లో పడిపోయినా వారిని సేఫ్టీగా బయటకు తీయవచ్చు.
వర్షం నీటి సంరక్షణ
ఆవిష్కర్త : జి స్పందన
పాఠశాల పేరు : జడ్పీహెచ్ఎస్, శేఖాపూర్, జహీరాబాద్ మండలం
వివరణ : ఇంటిపై పడే వర్షం నీటిని ఒక ట్యాంకులో పడేలా ఏర్పాటు చేసి ఆ నీటిని అవసరాలకు వాడుకుకోవచ్చు. ఇందులో మూడు పైపులు, ట్యాంక్, ఇసుక, బొగ్గు ఉపయోగించింది.
ప్రత్యేక ఆకర్షణగా నోటి బొమ్మలు
ఆవిష్కర్త : మధు కుమార్
పాఠశాల పేరు : కంకోల్ ఉన్నత పాఠశాల, మునిపల్లి మండలం
వివరణ : చిన్నతనంలో విద్యుత్ షాక్కు గురై రెండు కాళ్లు, రెండు చేతులు పోగొట్టుకున్న మధుకుమార్ తన నోటితో బొమ్మలు వేసి ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఫోల్డబుల్ రెయిన్ కోట్
ఆవిష్కర్తలు : నాగరాజ్, అఖిల్
పాఠశాల పేరు : జడ్పీహెచ్ఎస్, మర్వేల్లి, వట్పల్లి మండలం
వివరణ : వర్షం కురిసిన సమయంలో ఈ పరికరం ద్వారా నీటిని ఒడిసి పట్టి ఇంటి, పెరటి అవసరాలకు వాడుకోవచ్చు. ఇందులో 12 వాట్స్ బ్యాటరీ, ట్యాప్ కీ, బాస్కెట్, స్టాండ్, మోటార్, ఫ్యాన్ వాడారు.