చేర్యాల, నవంబర్ 25 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆలయంలో చైర్మన్ గీస భిక్షపతి అధ్యక్షతన, ఆలయ ఈవో అలూరి బాలాజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 18న నిర్వహించే స్వామి వారి కల్యా ణం, బ్రహోత్మవాల ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డితో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 18న కల్యాణం, 20 మార్చి 2023 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్, పోలీస్, విద్యుత్, గ్రామీణ నీటిపారుదల, వైద్యారోగ్యశాఖ, టీఎస్ ఆర్టీసీ, పంచాయతీ, రోడ్లు, భవనాల శాఖ, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, అగ్నిమాపక, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భక్తులకు కావాల్సిన వసతులు, ఏర్పాట్లు, శాఖపరంగా అధికారులు చేపట్టే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
క్షేత్రంలో ఉత్సవాలకు నిరంతరంగా విద్యు త్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఆర్టీసీ అధికారులు కొమురవెల్లి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు వేములవాడ క్షేత్రం నుంచి కొమురవెల్లి మీదుగా యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్ సర్వీసులు, సోమ, మంగళవారాల్లో కొమురవెల్లి నుంచి కొండపోచమ్మ ఆలయాలకు బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. రాజీవ్ రహదారిలో స్వాగత తోరణాల వద్ద అర్టీసీ ఆర్డీనరీ, ఎక్స్ప్రెస్ బస్సులు నిలిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు, మం దులు నిల్వ చేయాలని వైద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. భక్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేసే గోదావరి జలాలను తాగునీటిగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చే ఆర్అండ్బీ, పీఆర్ రహదారులపై గుంతలు పూడ్చాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు వసతిగా ఉండేందుకు తిమ్మారెడ్డిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో మూసివేసిన రోడ్డును తాత్కాలికంగా తెరిచి ఉంచాలని రైల్వే అధికారులకు సూచించారు.
సిద్దిపేట నుంచి కొమురవెల్లికి వచ్చే కమాన్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ను విస్తరించాలని కోరారు. దాసారం గుట్టను కొనుగోలు చేసి ఆలయ భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. వైద్యు లు, సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవాల బ్రోచర్, వాల్పోస్టర్, స్వామివారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన కార్డులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమీక్షా సమావేశంలో అడిషనల్ డీసీపీ మహేందర్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, సర్పంచ్ సార్ల లతకిష్టయ్య, ఏసీపీ సతీశ్, సీఐ శ్రీనివాస్, ఎస్సై చంద్రమోహన్, ఎక్సైజ్ సీఐ మహేంద్రకుమార్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ అనిల్కుమార్, ఏఈవో వైరాగ్యం అంజ య్య, ఆలయ పాలక మండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కొమురవెల్లి క్షేత్రాభివృద్ధి
స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ స్వామివారి క్షేత్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి అభివృద్ధి దిశలో సాగుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో 50 కాటేజీల నిర్మాణం జరుగుతున్నదన్నారు. తెలంగాణ రాక ముందు రూ.5కోట్ల ఆదాయం ఉన్న కొమురవెల్లి టెంపుల్ సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో రూ.33 కోట్లకు చేరిందన్నారు. భవిష్యత్లో కొమురవెల్లి దివ్య క్షేత్రంగా తయారవుతుందన్నారు. ఆలయవర్గాలు స్వామి వారి కల్యాణోత్సవం, ఉత్సవాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మల్లన్న క్షేత్రం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని టెంపుల్ సిటీగా గుర్తించి, హద్దులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ డోనర్ స్కీంలో దాసారం గుట్ట పైభాగంలో ఆధునిక వసతులతో గెస్ట్హౌస్లు నిర్మించనున్నారని, వారితో పాటు మరో 9 మంది డోనర్లు ఒక్కక్కొరు రూ.కోటితో గెస్ట్హౌస్లు నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 500 గజాల స్థలాన్ని డోనర్కు కేటాయిస్తామని, అందులో కనీసం కోటి వ్యయంతో అన్ని వసతులతో ఆధునిక సౌకర్యాలతో భవనం నిర్మించాలన్నారు. ఉత్సవాలు ద్విగ్విజయంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.