సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 9: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేస్తూ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమస్యలుంటే హెల్ప్ లైన్ నంబర్లు 08455-276155, 08455-272233లకు తెలపాలని సూచించారు. భారీ వర్షాలకు విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఎస్ఈ సెల్ నంబరు 9440813620, 9440813707లో సంప్రదించాలని కోరారు.
మరో 3 రోజులు అతి భారీ వర్షాలుసంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జిన్నారంలో 4.9 సె.మీ వర్షం కురిసింది. మొగుడంపల్లిలో 3.8 సె.మీ, కల్హేర్, ఆర్సీపురంలలో 3.4 సెం.మీ, గుమ్మడిదలలో 3.3 సెం.మీ, హత్నూర, అమీన్పూర్లో 3.2సె.మీ, కోహీర్, జహీరాబాద్లలో 3.1సె.మీ, పటాన్చెరులో 2.9సె.మీ వర్షం కురిసింది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయాయ్యారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. జలాశయాలన్నీ జల కళను సంతరించుకుంటున్నాయి.
హెల్ప్ డెస్క్, రెస్క్యూ టీంల ఏర్పాటు
భారీ వర్షాలు కురుస్తున్నందున సంగారెడ్డి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. రాబోయే మూడు నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని వారు పేర్కొన్నారు. కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు పట్టణ స్థాయిలో రాబోవు విపత్తులను ఎదుర్కొనేందుకు హెల్ప్ డెస్క్, రెస్క్యూ టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇనుప స్తంభా లు తాకరాదని, పిల్లలు పెద్దలు చుట్టుపక్కల సంచరించరాదని, పశువులను వదలకూడదని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, దగ్గరలో ఉన్న ప్రభుత్వ భవనాలు వినియోగించుకోవాలని సూచించారు.
మెదక్లో కంట్రోల్ రూం ఏర్పాటు-ఎస్పీ రోహిణిప్రియదర్శిని
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను పోలీసులు తనిఖీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో జిల్లా పోలీసు అనుక్షణం అప్రమత్తంగా ఉండి, పర్యవేక్షిస్తున్నారన్నారు. పోలీసు స్పెషల్ బ్రాంచ్, ప్రత్యేక పోలీసులు, సిబ్బంది రక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. బాధితుల సహాయం కోసం జిల్లా కేంద్రంలో పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24/7 నిరంతర సహాయక చర్యలు చేపడుతున్నట్లు, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ పరిధిల్లో చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్ద ప్రమాదకర స్థాయిని పరిశీలించి, రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న వాగులు, చెరువుల వద్ద పెట్రోలింగ్ పెంచి హెచ్చరికలు జారీ చేసేందుకు పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేశారు. గ్రామాల్లో డప్పు చాటించి ప్రమాదబారిన పడకుండా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ఎస్సైలను ప్రత్యేకంగా తమ సిబ్బందితో కలిసి రక్షణ చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100 కానీ పోలీస్స్టేషన్కు కానీ, పోలీసు కంట్రోల్ రూం 08452-223533, 7330671900కు సమాచారం ఇవ్వాలని అన్నారు.