సంగారెడ్డి, జూలై 4(నమస్తే తెలంగాణ) : ఐఐటీ హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఐఐటీ హైదరాబాద్ సత్తాచాటుతున్నది. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ అండ్ డాటా ఇక్విజేషన్ సిస్టమ్(టీహాన్) తయారుచేసిన అటానమస్ వెహికిల్, ప్యాసింజర్ డ్రోన్, సైకిల్ను సోమవారం ఐఐటీహెచ్లో విజయంతంగా పరీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో రూ.135 కోట్లతో దేశంలోనే మొదటిసారి నిర్మించిన అటానమస్ నావిగేషన్ టెస్టుబెడ్ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించారు. టెస్టు బెడ్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి సమక్షంలో టీహాన్ తయారు చేసిన అటానమస్ వెహికిల్, ప్యాసింజర్ డ్రోన్, అటానమస్ సైకిల్ను పరీక్షించారు. మూడు పరీక్షలు విజయవంతమయ్యాయి.
టీహాన్ రూపొందించిన అటానమస్ వాహనంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి చంద్రశేఖర్, ఐఐటీ గవర్నింగ్ బోర్డు చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ డైరక్టర్ మూర్తి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూర్చుని ప్రయాణించారు. అటానమస్ సైకిల్ పనితీరును కేంద్ర మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. టీహాన్ రూపొందించిన ప్యాసింజర్ ద్రోన్ గాలిలోకి ఎగిరి ప్రయాణించడాన్ని కేంద్ర మంత్రి ఆసక్తిగా తిలకించారు. టీహాన్ రూపొందించిన అటానమస్ నావిగేషన్ అండ్ డాటా ఇక్విజేషన్ సిస్టమ్ పనితీరు గురించి ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి కేంద్ర మంత్రికి వివరించారు. తాము రూపొందించిన అటానమస్ నావిగేషన్ అండ్ డాటా ఇక్విజేషన్ సిస్టమ్ల ద్వారా అటానమస్ వాహనం, ప్యాసింజర్ డ్రోన్, అటానమస్ ప్యాసింజర్ సైకిల్ టెస్టుబెడ్పై ప్రయాణించినట్లు తెలిపారు.
అటానమస్ వాహనాలకు సంబంధించిన మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్లోని ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ మాట్లాడారు. ఐఐటీ హైదరాబాద్లో దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ బెడ్ ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. అటానమస్ వాహనాలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు రాబోయే రోజుల్లో రవాణా రంగంలో కీలక మార్పులు తీసుకువస్తాయని తెలిపారు. నూతన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా ఐఐటీ హైదరాబాద్ అనతి కాలంలోనే దక్షిణ భారతదేశంలో మంచి పేరు సంపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ప్రొఫెసర్లు రాజ్యలక్ష్మి, కిరణ్ కూచి, టీహాన్ బృందం సభ్యులు, ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
పరిశోధనలకు మరింత ఊపు
ఐఐటీ హైదరాబాద్ నూతన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నది. ముఖ్యంగా అటానమస్ వాహనాలకు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో రెండేండ్లుగా విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నది. అటానమస్ వాహనాలకు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ అండ్ డాటా ఇక్విజేషన్ సిస్టమ్(టీహాన్)ను ఏర్పాటు చేసింది. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి పర్యవేక్షణలో ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి టీహాన్కు నాయకత్వం వహిస్తున్నారు. విద్యార్థుల బృందం టీహాన్లో అటానమస్ వాహనాలకు సంబంధించిన సాంకేతికపై వరుసగా పరిశోధనలు జరుపుతున్నది. డ్రైవర్ లేకుండా స్వయం ప్రతిపత్తితో వాహనం నడిచేందుకు అవసరమైన సాంకేతికతను టీహాన్ అభివృద్ధి చేసింది. దీనిని పరీక్షించేందుకు ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటి అటానమస్ టెస్టు బెడ్ను ఏర్పాటు చేశారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రహదారులు, ట్రాఫిక్ సిగ్నల్స్, బస్టాప్లను టెస్టుబెడ్లో ఏర్పాటు చేశారు. టీహాన్ అభివృద్ధి చేసిన నూతన అటానమస్ నావిగేషన్ ఆండ్ డాటా ఇక్విజేషన్ సిస్టమ్ బిగించిన వాహనాన్ని సోమవారం విజయవంతంగా పరిశీలించారు. టీహాన్ బృందం రూపొందించి డ్రోన్ ప్యాసింజర్, అటానమస్ సైకిల్ను పరీక్షించారు. అటానమస్ వెహకిల్, అటానమస్ సైకిల్, డ్రోన్ ప్యాసింజర్ పరీక్షలు విజయవంతం కావటంతో ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు సంబురాల్లో మునిగిపోయారు.
పరిశోధనలు ఫలప్రదం..
ఐఐటీహెచ్ స్వయంప్రతిపత్తి వాహనాల వైపు పరిశోధనలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిధులు సమకూరుస్తున్నది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి స్టార్టప్లు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం నిధులు సమకూరుస్తున్నాం. -శ్రీవారి చంద్రశేఖర్,కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి
ప్రయోగాలు ఉపయోగకరం..
ఐఐటీ హైదరాబాద్ అటానమస్ వాహనాల పరిశోధనల్లో ముందున్నది. దేశంలోనే మొట్టమొదటి అటానమస్ నావిగేషన్ టెస్టు బెడ్ ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ప్రమాదాల నివారణ, విపత్తు నివారణకు అటానమస్ డ్రోన్లు ఉపయోగపడతాయి. ఐఐటీ హైదరాబాద్ తన పరిశోధనల ఫలితాల ద్వారా పరిశోధనలకు నిధులు సమకూర్చుకోవడంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
– బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ గవర్నింగ్ బోర్డు చైర్మన్
దేశంలోనే మొదటిసారి..
ఐఐటీ హైదరాబాద్లో రూ.135 కోట్లుతో రెండు కిలోమీటర్ల మేర అటానమస్ నావిగేషన్ టెస్టు బెడ్ను ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇది మొట్టమొదటి టెస్టుబెడ్ ఇది. టెస్టుబెడ్ ప్రారంభించుకోవటం ద్వారా అటానమస్ వాహనాల పరిశోధనలు మరింత వేగంగా సాగుతాయి. టీహాన్ అటానమస్ ప్యాసింజర్ డ్రోన్, వాహనం, సైకిల్ను తయారు చేశాం. మూడింటిని కేంద్ర మంత్రి సమక్షంలో విజయవంతగా పరీక్షించాం. టీహాన్ బృందం ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి, ప్రొఫెసర్ కిరణ్కూచితో పాటు సభ్యులకు నా అభినందనలు.
– బీఎస్ మూర్తి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్